వరుసగా రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. ఇటీవల ఇంధన ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల్లో 60 శాతం వరకు కేంద్ర, రాష్ట్రాల పన్నులు ఉంటాయి. నేడు (జూన్ 27, ఆదివారం) ధరలు పెరగడంతో మే 4వ తేదీ నుండి ఇది 31వ పెరుగుదల. అంతకుముందు దేశీయ చమురురంగ మార్కెటింగ్ కంపెనీలు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పద్దెనిమిది రోజుల పాటు ధరలను సవరించలేదు. ఆ తర్వాత ధరల సవరణ కనిపిస్తోంది. మే 4వ తేదీ నుండి 31 రోజులు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.102 క్రాస్
తాజా పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ.104.56కు చేరుకుంది. లీటర్ డీజిల్ రూ.96.42 పలికింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.98.46, లీటర్ డీజిల్ రూ.88.90గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.99.49, డీజిల్ రూ.93.46, కోల్కతాలో పెట్రోల్ రూ.98.30, డీజిల్ రూ.91.75, భోపాల్లో లీటర్ పెట్రోల్ రూ.106.71, లీటర్ డీజిల్ రూ.97.63గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోను లీటర్ పెట్రోల్ ధర రూ.102 దాటింది.
ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ట్యాక్స్
పెట్రోల్, డీజిల్ ధరల్లో అరవై శాతానికి పైగా పన్నులు ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు రూ.100 కంటే పైకి చేరాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, జమ్ము కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో పెట్రోల్ సెంచరీ దాటింది. పెట్రోల్, డీజిల్ పైన రాజస్థాన్లో అత్యధిక వ్యాట్, ట్యాక్స్ ఉంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ ట్యాక్స్ ఉంది.
ఎంత పెరిగాయంటే
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిన మొదటి ప్రాంతం. మిడ్ ఫిబ్రవరి నుండి నెలలో పెట్రోల్ ధర ఇక్కడ సెంచరీ దాటింది. నేడు లీటర్ పెట్రోల్ పైన 35 పైసలు, లీటర్ డీజిల్ పైన 25 పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.102.32, లీటర్ డీజిల్ రూ.96.90గా ఉంది.