Fuel Prices : స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 27, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 109 వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 107 డాలర్లకు పైన ఉంది. మన దేశంలో చాలా రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండగా, పాకిస్తాన్, నేపాల్ వంటి దేశాల్లో మాత్రం పెరుగుతోంది. నేపాల్లో ధరలు భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సంఘాలు, పార్టీలు ఇటీవల ర్యాలీ నిర్వహించాయి.
చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ ఇంధన అవసరాలలో 80 శాతం దిగుమతుల ద్వారా వస్తున్నాయి. అయితే కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం వల్ల చమురు మార్కెటింగ్ సంస్థలకు లీటర్ పెట్రోల్ పైన రూ.13.08, డీజిల్ పైన రూ.24.09 నష్టం వాటిల్లుతోంది. దీంతో చమురు మార్కెటింగ్ సంస్థలు కేంద్రం జోక్యం చేసుకోవాలని కొద్ది రోజుల క్రితం కోరాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ను విక్రయించలేమని ప్రయివేటు పెట్రోల్ పంప్స్ రిటైల్ డీలర్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల తేల్చి చెప్పారు.