Fuel Prices : స్థిరంగానే పెట్రోల్ , డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూలై 04, సోమవారం) స్థిరంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మే 21వ తేదీన లీటర్ పెట్రోల్ పైన రూ.8, లీటర్ డీజిల్ పైన రూ.6 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుండి కూడా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. కేంద్రం ఎక్స్చైజ్ డ్యూటీని తగ్గించిన తర్వాత ఢిల్లీలో రూ.9.5, లీటర్ డీజిల్ రూ.7 తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62గా ఉంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.66, లీటర్ డీజిల్ రూ.97.82గా ఉంది.
దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. ఇటీవల చమురు రంగ సంస్థలు పెట్రోల్, డీజిల్ పైన నష్టాలను చవిచూస్తున్నాయి. ప్రభుత్వరంగ కంపెనీలు అయితే ప్రభుత్వమే నష్టాన్ని భరిస్తుంది. అయితే కొన్ని ప్రయివేటు కంపెనీలు ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ధరలను స్వల్పంగా పెంచాయి. ప్రభుత్వరంగ పెట్రోల్ బంకుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉంటే, ప్రయివేటు పెట్రోల్ బంకుల్లో రూ.5 పెంచి, రూ.115 వరకు తీసుకుంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు 110 డాలర్లకు కాస్త అటు ఇటుగా కదలాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 120 డాలర్ల స్థాయికి కూడా చేరుకుంది. బ్రెంట్ క్రూడ్ క్రితం సెషన్లో 2.45 డాలర్లు ఎగిసి 111.48 డాలర్ల వద్ద, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ ధర 2.70 డాలర్లు ఎగిసి 108.46 డాలర్ల వద్ద కదలాడుతోంది.