Petrol, diesel prices: నిన్న తగ్గి, నేడు స్థిరంగా పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(ఆగస్ట్ 23) స్థిరంగా ఉన్నాయి. నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు నిన్న(ఆదివారం) స్వల్పంగా తగ్గాయి. డీజిల్ ధరలు ఇటీవల పలుమార్లు తగ్గాయి. దేశీయ చమురురంగ కంపెనీలు నిన్న చమురు ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 35 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర ఆదివారం 15 పైసల నుండి 20 పైసలు తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధరలు గతవారం మొదట మూడు రోజులు తగ్గి, ఒకరోజు స్థిరంగా ఉండి, నిన్న మరోసారి తగ్గాయి. నిన్న డీజిల్ 18 పైసల నుండి 20 పైసల మధ్య తగ్గింది. ఇటీవలి వరకు నెల రోజులకు పైగా ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17వ తేదీన పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి స్థిరంగా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి (గత నెలలో) లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ ఆగస్ట్ నెలలో ధరలు ఇప్పటి వరకు పెరగలేదు. పైగా డీజిల్ ధరలు నాలుగుసార్లు, పెట్రోల్ ధర ఒకసారి తగ్గింది. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.64, లీటర్ డీజిల్ రూ.89.07గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.66, డీజిల్ రూ.96.64గా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.63, లీటర్ డీజిల్ రూ.97.16గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు గతవారం ఏకంగా 7 శాతం క్షీణించాయి. డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం, చైనాలో డిమాండ్ ఔట్ లుక్ క్షీణత నేపథ్యంలో చమురు ధరలపై ప్రభావం చూపింది. చమురు ధరలు గత సోమవారం ఒక్కరోజే 3 శాతానికి పైగా క్షీణించాయి. ఆ తర్వాత అంతకంతకూ పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 70 డాలర్ల దిగువకు చేరుకొని, 66 డాలర్ల వద్ద ఉంది. ఇటీవల ఈ క్రూడ్ ధర 73 డాలర్లను కూడా తాకింది. అయితే డిమాండ్ లేమి భయాలతో ఇప్పుడు మళ్లీ తగ్గుతోంది. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడ్ ధర 62 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం వద్ద ఉన్నాయని బ్రిటన్కు చెందిన RAC ఇటీవల పేర్కొంది. లీటర్ పెట్రోల్ సగటున 135.13 పౌండ్స్ వద్ద ఉంది. సెప్టెంబర్ 2013 తర్వాత ఇదే గరిష్టం. డీజిల్ సగటున 137.06 పౌండ్స్ వద్ద ఉంది. 2014 నుండి ఇదే గరిష్టమని పేర్కొంది.
పెట్రోల్పై విధించిన ఎక్సైజ్ డ్యూటీని తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తగ్గించింది. పెట్రోల్పై వసూలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీలో రూ.3 తగ్గించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పీ త్యాగరాజన్ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టిన సందర్భంగా చేసిన ప్రసంగంలో పెట్రోల్పై మూడు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించనున్నట్లు ఇటీవల తెలిపారు. అయితే పెట్రోల్ ధరలు తగ్గించడంతో ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడిందని తమిళనాడు ఆర్థికమంత్రి తెలిపారు. కానీ రెండు కోట్ల మంది టూవీలర్లకు ఊరట లభించినట్లు తెలిపారు.