Petrol and diesel price today: స్థిరంగానే పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం(సెప్టెంబర్ 13) కూడా స్థిరంగా ఉన్నాయి. వారం క్రితం(అంతకుముందు ఆదివారం) ధరలు స్వల్పంగా తగ్గాయి. అప్పుడు దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పైన 19 పైసలు తగ్గి రూ.101.19, లీటర్ డీజిల్ పైన 15 పైసలు తగ్గి రూ.88.77 నుండి రూ.88.62గా ఉంది. నాటి నుండి ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి పెరిగింది మాత్రం జూలై 17వ తేదీ. డీజిల్ ధరలు జూలై 15వ తేదీ నుండి పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇటీవల తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరుగంటలకు ధరలను సవరిస్తాయి. చివరిసారి జూలై నెలలో లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. జూలైలో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. గత ఆగస్ట్ నెలలో ధరలు ఒక్కసారి పెరగలేదు. పైగా డీజిల్, పెట్రోల్ ధరలు పలుమార్లు తగ్గాయి. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచిపోయింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదలలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.19, లీటర్ డీజిల్ రూ.88.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.107.26, డీజిల్ రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.98.96, డీజిల్ రూ.93.26, కోల్కతాలో పెట్రోల్ రూ.101.62, డీజిల్ రూ.91.71, హైదరాబాద్లో పెట్రోల్ రూ.105.35, డీజిల్ రూ.96.85గాఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సెప్టెంబర్ 1 నుండి పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా ఇప్పుడు ధరలను సవరించాయి. నాన్-సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) సిలిండర్ ధరలు రూ.25 పెంచాయి. నాన్-సబ్సిడీ 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇప్పుడు రూ.884.50కు పెరిగింది. గత రెండు వారాల్లో ఇది రెండో పెరుగుదల. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన, 15వ తేదీన సవరిస్తాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
డిమాండ్ పెరుగుతోంది..
దేశంలో పెట్రోల్ డిమాండ్ ఏడాది ప్రాతిపదికన ఆగస్ట్ నెలలో 10.9 శాతం మేర పెరిగింది. ఫ్యూయల్ కన్సంప్షన్ మొత్తం 16.00 మిలియన్ టన్నులుగా ఉంది. గ్యాసోలైన్ సేల్స్ లేదా పెట్రోల్ సేల్స్ 13 శాతం పెరిగి 2.69 మిలియన్ టన్నులకు చేరుకుంది. కుకింగ్ గ్యాస్ లేదా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG) విక్రయం 2.4 శాతం పెరిగి 2.33 మిలియన్ టన్నులకు పెరిగింది. నాహ్తా సేల్స్ మాత్రం 5.1 శాతం క్షీణించి 1.2 మిలియన్ టన్నులకు పడిపోయింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఇటీవల అస్థిరంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ టెక్సాస్ ఇంటర్మీడియేట్(WTI) క్రూడ్ ధర క్రితం సెషన్లో స్వల్పంగా పెరిగి 69.72 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ ధర కూడా స్వల్పంగా పెరిగి 72.92 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేచరల్ గ్యాస్ ధర మాత్రం అతి స్వల్పంగా తగ్గి 4,938 డాలర్లకు చేరుకుంది. హీటింగ్ ఆయిల్ ధర స్వల్పంగా పెరిగి 2.146 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. గతవారం డెల్టా వేరియంట్ కేసుల ప్రభావం, చైనాలో డిమాండ్ ఔట్ లుక్ క్షీణత నేపథ్యంలో చమురు ధరలు గత నెల చివరలో ఏడు శాతం వరకు తగ్గాయి.
అంతకుముందు వారం బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు 72.61 డాలర్ల వద్ద ముగిసింది. ఆ తర్వాత క్షీణించినప్పటికీ, ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఇటీవల చైనాలో కరోనా మరోసారి ఆందోళనకు గురి చేసింది. దీంతో లాక్ డౌన్ ఆంక్షలు, చమురు డిమాండ్ తగ్గింది. అంతేకాదు, ప్రభుత్వ క్రూడ్ రిజర్వ్స్ విక్రయిస్తామని చైనా ప్రకటించడంతో కూడా ధరలు తగ్గాయి. అయితే ఆ తర్వాత చమురు డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో చమురు ధరలు పెరిగి, చైనాకు చెందిన సినోపెక్ 2021 మొదటి అర్ధ సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల లాభాలను నమోదు చేసింది. ఏసియాలో సౌదీ ఆరామ్కో క్రూడాయిల్ ధరలను తగ్గించడంతో క్రూడాయిల్ ధరలు ఒత్తిడిలో ఉన్నాయి.