20వరోజు పెరిగిన పెట్రోల్ ధర, 12కు పైగా నగరాల్లో రూ.80 క్రాస్
ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు (జూన్ 26, శుక్రవారం) పెరిగాయి. చమురు రంగ కంపెనీలు వరుసగా 20వ రోజు ధరలను పెంచాయి. ఈ రోజు లీటర్ డీజిల్ పైన 17 పైసలు, లీటర్ పెట్రోల్ పైన 21 పైసలు పెరిగింది. లాక్ డౌన్ కారణంగా దాదాపు మూడు నెలల పాటు చమురురంగ సంస్థలు ధరలను సమీక్షించలేదు. జూన్ 7వ తేదీ నుండి సమీక్ష ప్రారంభించాయి. అప్పటి నుండి పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజు పెరుగుతున్నాయి.
సంక్షోభంలో చమురు ఇండస్ట్రీ, క్రూడాయిల్ భద్రతపై చైనా వ్యూహం
ఈ రోజుతో పెట్రోల్ ధర ఈ 20 రోజుల్లో రూ.8.81, డీజిల్ ధర రూ.10.80 పైసలు పెరిగింది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.13, లీటర్ డీజిల్ ధర రూ.80.19కి చేరుకుంది. వీటికి ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులు అదనంగా కలవడంతో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.87కు 9 పైసలు మాత్రమే తక్కువ ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.78.51గా ఉంది.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్ ధర రూ. 83.18, డీజిల్ ధర రూ.78.36గా ఉంది. అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు అలాగే ఉన్నాయి. పెట్రోల్ రూ.83.53, డీజిల్ రూ.78.67గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ రూ.83.13, డీజిల్ ధర లీటర్ రూ.78.30గా ఉంది. 12 నగరాల్లో పెట్రోల్ ధర లీటర్ రూ.80కి పైకి చేరుకుంది. జైపూర్, ఢిల్లీలలో లీటర్ డీజిల్ ధర రూ.80 కంటే పైకి కదలాడుతోంది.