దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడిపై నిత్యావసర ధరల మోత
సుమారు రెండేళ్ల విరామం తర్వాత దేశంలో Fuel ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ తాజా పెంపుతో వాహనదారులు, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడనుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు అన్ని ప్రధాన నగరాల్లోనూ ధరలు భారీగా పెరిగాయి. చమురు కంపెనీలు లీటరు పెట్రోల్పై దాదాపు రూ. 3 వరకు పెంచాయి.
ఢిల్లీలో గతంలో లీటరు పెట్రోల్ రూ. 94.77 ఉండగా, ఇప్పుడు అది రూ. 97.77కి చేరింది. అలాగే డీజిల్ ధర రూ. 87.67 నుండి రూ. 90.67కి పెరిగింది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో ధరలు ఎప్పుడూ కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ పెట్రోల్ ధర రూ. 106.68కి చేరుకోగా, డీజిల్ ధర రూ. 93.14గా ఉంది.అలాగే కోల్కతాలో పెట్రోల్ ధర రూ. 108 దాటగా, చెన్నైలో కూడా రూ. 103 పైన పలుకుతోంది.

ఈ ధరల పెంపు వెనుక ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల ప్రపంచ మార్కెట్లో ముడిచమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతలు చమురు రవాణా వ్యవస్థను దెబ్బతీశాయి. ఈ పరిణామాలను కేంద్ర ప్రభుత్వం ముందే పసిగట్టింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిస్తూ, అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మరియు కార్పూలింగ్ వంటి పద్ధతులను పాటించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ ముందస్తు సంకేతాల వల్ల ధరలు భారీగా పెరుగుతాయని అందరూ భావించినప్పటికీ, చమురు కంపెనీలు రూ. 3 పెంపుతోనే ప్రస్తుతానికి సరిపెట్టాయి.
అయితే ఈ పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా, నిత్యావసర వస్తువుల ధరలపైన కూడా ప్రతాపం చూపనుంది. డీజిల్ ధర పెరగడం వల్ల లారీలు, ట్రక్కుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో కూరగాయలు, పండ్లు మరియు ఇతర సరుకుల ధరలు ప్రియం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు ఈ పెంపు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. సోషల్ మీడియా వేదికగా ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ పెంపు తాత్కాలికమేనా లేక యుద్ధం కొనసాగితే ధరలు మరింత పెరుగుతాయా అనే సందిగ్ధంలో వినియోగదారులు ఉన్నారు.

ఆర్థికవేత్తల విశ్లేషణ ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధరల పెంపు అనివార్యమని తెలుస్తోంది. ధరలు పెరగడం వల్ల ఇంధన వినియోగం సహజంగానే తగ్గుతుందని, ఇది సరఫరా మరియు డిమాండ్ మధ్య సమతుల్యతను కాపాడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదైనవిగా మారుతున్నప్పటికీ, ఇది ఎగుమతులకు లాభదాయకంగా మారి ప్రస్తుత ఖాతా లోటును కొంతవరకు తగ్గించే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
ఈ తాజా మార్పుల వల్ల హైదరాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ ధర రూ. 110.50 కి, డీజిల్ రూ. 98.70 కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ రూ. 97.77 గా ఉండగా, ముంబైలో రూ. 106.54 వద్ద కొనసాగుతోంది. అలాగే తిరువనంతపురంలో పెట్రోల్ ధర గరిష్టంగా రూ. 110.38 కి చేరగా, చండీగఢ్లో అత్యల్పంగా రూ. 97.30 గా ఉంది. మొత్తానికి అంతర్జాతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగి, సరఫరా వ్యవస్థ పుంజుకునే వరకు ఇంధన ధరల్లో స్థిరత్వం వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications
