Galla Ramachandra Naidu Sucess Story: మనం పుట్టిన ఊరు చిన్నదైనా, మన కలలు పెద్దవైతే, మన గమ్యస్థానం ప్రపంచమే అవుతుంది. కష్టపడిన వాడికి అసాధ్యం అన్నది ఉండదు. సాధ్యం కాని దానిని కూడా సాధ్యం చేసే కసి ఉంటుంది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే వ్యక్తి కథ కూడా అదే.. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చిన్న గ్రామం పెట్టమిట్టలో ఒక చిన్న రైతు ఇంట్లో పుట్టిన ఓ బాలుడు ఇప్పుడు ప్రపంచం గర్వించే వ్యాపారవేత్తగా మారాడు. పొలాల మధ్య పెరిగిన అతడు ఇప్పుడు బ్యాటరీల రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదిగాడు. అతనే గల్లా రామచంద్రనాయుడు.. అమర రాజా బ్యాటరీస్ అధినేత. 1985లో ఒక చిన్న ఫ్యాక్టరీతో ప్రారంభమైన ఆయన ప్రస్థానం నేడు రూ. 18,700 కోట్లకు పైగా టర్నోవర్ ను సాధించే స్థాయికి ఎదిగాడు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు.. గల్లా రామచంద్రనాయుడు సక్సెస్ స్టోరీ ఈ వారం మీకోసం..
బాల్యం నుంచే ఎన్నో తెలివితేటలు: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా చిన్న గ్రామం పెట్టమిట్టలోని ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించాడు. పొలాల మధ్య పెరిగిన అతని బాల్యం చాలా సాదాసీదాగా గడిచింది. ఉన్న ఊళ్లో కనీస వసతులు లేక గ్రామం నుంచి కిలోమీటర్ల మేర నడిచి వెళ్లి ప్రాథమిక విద్యనభ్యసించారు.అయితే అతనికి చిన్నప్పటినుంచే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉండేది. అదే రేడియోలు, విద్యుత్ తీగలు, సర్క్యూట్లు బాగు చేయడం. గ్రామంలో ఎవరైనా రేడియో పాడైందని తీసుకొస్తే.. ఆ బాలుడు తన చిన్నచిన్న చేతులతో దాన్ని సరిచేసేవాడు. ఆ చిన్న ఆసక్తే అతని జీవితాన్ని మారుస్తుందని అప్పట్లో ఎవరికీ తెలియదు.

ఉన్నత విద్య కోసం అమెరికాకు: అనంతపురం ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించాడు. జీవితంలో ఎదైనా సాధించాలంటే ఉన్నత చదువులు అవసరం అని గ్రహించిన అతను ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లాడు. మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ గేట్లు దాటినప్పుడు.. అతని కళ్లల్లో కలలు మాత్రమే కనిపించాయి. అమెరికాలో ఉన్నత విద్య చదవడం అతని గ్రామానికి ఒక అద్భుతం లాంటిది. తన ఊరి నుండి అక్కడికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. అమెరికాలో చదివి, మంచి జీతం వచ్చే ఉద్యోగం సంపాదించి సుఖంగా జీవించగలిగాడు. అయితే అతని హృదయం మాత్రం నిశ్శబ్దంగా అతన్ని ఎఫ్పుడూ అడుగుతూనే ఉండేది.. నీ ఊరికి తిరిగి వెళ్ళి, నీ మట్టికోసం ఏదైనా చేయలేవా అని..
ఒక్క ప్రశ్నతో అమెరికాను వదిలి స్వదేశానికి : నీ ఊరికి తిరిగి వెళ్ళి, నీ మట్టికోసం ఏదైనా చేయలేవా అనే ప్రశ్నే అతన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చింది. 1985లో తన కలలను చేతబట్టి అమెరికాలోని సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలి స్వదేశానికి తిరిగి వచ్చాడు రామచంద్ర. చిత్తూరు జిల్లాలోని కరకంబాడి గ్రామంలో ఒక చిన్న ఫ్యాక్టరీతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో ఎవరూ అతనిని నమ్మలేదు. ఒక పల్లె మనిషి అంత పెద్ద వ్యాపారం చేయగలడని ఎవరూ ఊహించలేదు. అయితే ఆయనకు మాత్రం నమ్మకం ఉండేది, కష్టపడి ముందుకు వెళ్తే ఏదైనా సాధ్యమే అని గట్టిగా నమ్మేవాడు. సాధ్యం చేసి చూపించాడు.

సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం: అందరూ వాడుతున్న సాంప్రదాయ బ్యాటరీలలో అతనికి లోపాలు కనిపించాయి. వాటికి ప్రత్యామ్నాయం కావాలని భావించాడు. ఆ సమయంలో భారతదేశంలో ఆటోమోటివ్ బ్యాటరీల రంగం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడి ఉండేది. నాణ్యత కలిగిన, దీర్ఘకాలం పనిచేసే బ్యాటరీల కొరత స్పష్టంగా కనిపించింది. అలా సీల్డ్ మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీలు అనే కొత్త ఆవిష్కరణను భారత మార్కెట్లోకి తీసుకొచ్చాడు. మొదట్లో కొందరు ఆయన చేసే పనిని చూసి నవ్వుకున్నారు. కానీ కొద్ది కాలానికే దేశం మొత్తం ఆయన ఆవిష్కరణ వైపు చూసింది. తర్వాత అమెరికన్ కంపెనీ Johnson Controlsతో చేతులు కలిపి అమర రాజా అనే బ్రాండ్ను ప్రారంభించాడు. ఆ పేరు నేడు ప్రతి ఇంటిలో వినిపిస్తోంది.
అనతికాలంలోనే టాప్ వ్యాపారవేత్తగా: ఆయన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగింది. టాటా, మహీంద్రా, హ్యుందాయ్, అశోక్ లేలాండ్.. ఇలా చాలా కంపెనీలు ఆయన కస్టమర్లుగా మారాయి. ఒకప్పుడు గ్రామంలో రేడియో రిపేర్ చేసిన బాలుడు, ఇప్పుడు కోట్ల విలువైన కంపెనీని నడిపిస్తూ అందరికీ తలమానికంగా నిలిచాడు. అమర రాజా గ్రూప్ నేడు ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.నేడు కంపెనీ 18,700 కోట్లకు పైగా టర్నోవర్ తో బ్యాటరీ రంగాన్ని శాసిస్తోంది. బ్యాటరీలే కాకుండా ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో కూడా తన పాదం మోపింది. దీని ప్రధాన కార్యాలయం కరకంబాడి తిరుపతి లో ఉంది. ప్రస్తుతం అమర రాజా గ్రూప్లో 15750 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ తరువాత భారతదేశంలో రెండవ అతిపెద్ద అమ్మకపు ఆటోమోటివ్ బ్యాటరీ బ్రాండ్ ఇదే..

60 దేశాలలో అమర రాజా బ్యాటరీలు: అమర రాజా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అమర రాజా పవర్ సిస్టమ్స్ లిమిటెడ్, అమర రాజా ఇన్ఫ్రా (పి) లిమిటెడ్, మంగల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అమరా రాజా బ్యాటరీస్ లిమిటెడ్ వంటి కంపెనీలు అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కింద ఉన్నాయి. అమర రాజా బ్యాటరీలు 60 కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉన్నాయి, అయితే వారి పారిశ్రామిక బ్యాటరీల ఉనికి 30 కంటే ఎక్కువ దేశాలలో ఉంది. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ లిమిటెడ్ (Amara Raja Energy & Mobility Limited) తమ ఆటోమోటివ్ బ్యాటరీలను ప్రపంచవ్యాప్తంగా 60కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తుంది. వారి పారిశ్రామిక బ్యాటరీలు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోని 30 కంటే ఎక్కువ దేశాలలో వినియోగదారులను చేరుకుంటాయి.
ఎన్నో సేవా కార్యక్రమాలు: అయితే ఆయన విజయాన్ని కేవలం డబ్బుతో కొలవలేం. గ్రామం పట్ల, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతే ఆయనను మరింత గొప్పవాడిని చేసింది. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి ఇలా ప్రతి రంగంలోనూ ఆయన దాతృత్వం కనిపించింది. నా ఊరు, నా ప్రజలు ఎదగాలి అనే ఆలోచనతోనే ఆయన ప్రతి అడుగు ముందుకు వేశారు.గ్రామీణ విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాడు.

సొంతూరు ప్రాంత ప్రజలకు ఉపాధి : డాక్టర్ గల్లా రామచంద్ర నాయుడు కేవలం వ్యాపారంలోనే కాకుండా, తన పుట్టిన గ్రామం పేటమిట్టను అభివృద్ధి చేయంలోనూ ముందున్నారు. 1997లో, సొంతూరు ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఆయన పరిశ్రమ ఏర్పాటు చేశారు. పరిశ్రమ ద్వారా కేవలం ఉద్యోగం కల్పించడం కాకుండా, ప్రాంతాన్ని సుస్థిరంగా అభివృద్ధి చేయాలని ఆయన దృష్టి పెట్టారు. అయితే పేటమిట్ట తలుపులపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఉండటం వల్ల, కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. గ్రామానికి ప్రత్యేక పంచాయతీ స్థానం లేకపోవడం, మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన అనుమతులు లేవు వంటి సమస్యలు రాజకీయ, సాంకేతిక అవరోధాలుగా నిలిచాయి. అయితే, గల్లా రామచంద్ర నాయుడు అవరోధాలను ఎదుర్కొని, ప్రభుత్వం, స్థానిక అధికారులతో చర్చించి, 2008లో పేటమిట్టను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయించడంలో విజయం సాధించారు.

ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం: ఆ తరవాత గ్రామంలో సమగ్ర అభివృద్ధి ప్రారంభమైంది. 5 కిలోమీటర్ల అంతర్గత రహదారులు నిర్మించారు, 2 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు, వీధిదీపాలు, మంచి నీటి సరఫరా విధించారు. వైద్యం కోసం ప్రత్యేక ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేసి, గ్రామస్థుల ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం ఇచ్చారు. పరిశ్రమ ఏర్పాటుతో మొదలైన మార్పులు, గల్లా రామచంద్ర నాయుడు ప్రయత్నంతో పేటమిట్టను ఒక సజీవ, ఆధునిక గ్రామంగా మార్చేశాయని స్థానికులు చెబుతున్నారు. వృత్తిపరంగా వ్యాపారవేత్త అయినప్పటికీ, తన గ్రామం ప్రజలకోసం చేసిన సేవ ఆయనను నిజమైన నాయకుడిగా నిలిపింది.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు: గ్రామస్థులకు అత్యవసరమైన సౌకర్యాలను అందించడానికి 5 కిలోమీటర్ల రహదారులు, 2 కిలోమీటర్ల అండర్గ్రౌండ్ డ్రైనేజీ, వీధిదీపాలు, శుద్ధి నీటి సరఫరా ఏర్పాటు చేశారు. వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మార్గం కూడా ఏర్పరిచారు. మౌలిక వసతుల సరిపోవడమే కాక..బ్యాంకు, పోస్టాఫీస్, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసి, గ్రామాన్ని శ్రేయస్సు వైపు మలచారు. యువతకు జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా గ్రామ యువతకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి సాధనాలకు దారులు ఏర్పడ్డాయి.

శ్రీ కోదండరామ దేవాలయ ట్రస్టు ఏర్పాటు: గ్రామానికి ఆధ్యాత్మికతను తీసుకురావడంలో కూడా ఆయన దృష్టి పెట్టారు. గ్రామంలో ఉన్న విరూపాక్షమ్మ ఆలయం, చెట్టు కింద చిన్న ప్రాంగణంలో, వార్షిక విజయదశమి ఉత్సవాలు జరుపుకునేవి. ఇది గమనించిన నాయుడు గ్రామస్తులతో కలసి శ్రీ కోదండరామ దేవాలయ ట్రస్టు ఏర్పాటు చేశారు.దాదాపు ఒక ఎకరా విస్తీర్ణంలో 12 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయం నిర్మించడం ప్రారంభించారు. అక్కడ శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలతో ప్రధాన గుడి, ఒకవైపు మహా గణపతి, మరొకవైపు వేణుగోపాల స్వామి గుడి కూడా ఏర్పాటు చేశారు. భూమిపూజ 2019 జనవరిలో నిర్వహించి, పనులు ప్రారంభించారు. చిన్న గ్రామం అయినా, భూమి కొని, వ్యక్తిగత ధనాన్ని కూడా దేవాలయ సముదాయం కోసం వినియోగించారు. విద్య, ఆధ్యాత్మికత, సామాజికతను కలిపి, పేటమిట్ట గ్రామంలో మినీ ఓపెన్ ఆడిటోరియం, పార్క్, సామాజిక భవనం నిర్మించారు. వృద్ధులు సాయంత్రం ప్రశాంతంగా కూర్చోగలగాలి, మహిళలు భజనలు, కోలాటాలు, పిల్లలు ఆటలు ఆడుకునేందుకు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.
అవార్డులు: సుస్థిరత, దాతృత్వం, కార్పొరేట్ సామాజిక బాధ్యతలలో అందించిన విశేష సేవలతో, ఆయనకు మహాత్మ అవార్డు లభించింది.ఐపీఎస్ అధికారి డాక్టర్ కిరణ్ బేడీ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. ఈ వేడుక ఢిల్లీ రాజఘాట్లోని మహాత్మా గాంధీ సమాధి విశ్రాంతి స్థలంలో జరిగింది. మహాత్మా అవార్డు కార్యక్రమానికి ఆదిత్య బిర్లా గ్రూప్ మద్దతు అందించింది.2017లో బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డును అందుకున్నారు. నాటి కేంద్ర పార్లమెంటలరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డులను హెచ్ఎంటీవీ న్యూస్ ఛానల్ నిర్వహించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఆసియాలోనే "'బెస్ట్ అండర్ ఎ బిలియన్" 2010 జాబితాలో అమర రాజా బ్యాటరీస్ స్థానం సంపాదించింది
రామచంద్ర నాయుడు కథ ప్రతి యువకుడికి, ప్రతి వ్యాపారవేత్తకు చెబుతోంది. సంకల్పం, కృషి, సామాజిక బాధ్యత కలిగిన పని చేస్తే మాత్రమే నిజమైన విజయాన్ని పొందవచ్చు.
More From GoodReturns

బంగారంతో సరికొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. గురి చూసిన కొట్టిన దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

హైదరాబాద్లో పాడ్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్.. మెట్రో స్టేషన్ నుంచి నేరుగా ఆఫీసుకే వెళ్లిపోవచ్చు ఇక..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

హైదరాబాద్, పుణే వద్దు బెంగళూరు ముద్దు.. అధిక అద్దెలున్నా బెంగళూరును వదలమంటున్న టెక్ కంపెనీలు..

బంగారం ధరలు తగ్గాయి ..ఎంత తగ్గాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఫిబ్రవరి 26, గురువారం పసిడి ధరలు ఇవే..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Bengaluru: దక్షిణాది నుంచి ఉత్తరాదికి జెట్ స్పీడ్.. కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

వెండి ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో రూ. 3 లక్షలకు.. కొనేందుకు ఎగబడుతున్న పెట్టుబడిదారులు



Click it and Unblock the Notifications