ఓలా నుంచి పేటీఎం దాకా.. పెట్టుబడులతో స్టార్టప్ కంపెనీలను టాప్ కంపెనీలుగా మార్చిన రతన్ టాటా
2024 అక్టోబర్ 9న భారత కార్పోరేట్ ప్రపంచం ఒక మహానుభావుడిని కోల్పోయింది. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మరణం ప్రతి భారతీయుని హృదయాన్ని తాకింది. ఆయన మరణం కేవలం ఒక పారిశ్రామిక దిగ్గజుడి నష్టం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, నైతికత, ఆవిష్కరణల పట్ల ఉన్న ఆయన దృక్పథానికి పెద్ద శూన్యతను సృష్టించింది.
నావల్ టాటా, సోనూ కమిషరియట్ దంపతుల పెద్ద కుమారుడిగా జన్మించిన రతన్ టాటా..ట్రస్ట్ (నమ్మకం) అనే పదాన్ని టాటా సమూహం (Tata Group) తో సమానార్థకంగా మార్చారు. ఆయన నాయకత్వంలో టాటా సన్స్ ప్రపంచవ్యాప్తంగా 350 బిలియన్ డాలర్ల విలువైన సమ్మేళనంగా ఎదిగింది. అయితే ఆయన గొప్పతనం కేవలం పారిశ్రామిక విస్తరణలోనే కాదు.. భారతదేశంలో స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడంలో కూడా ఉంది.

రతన్ టాటా పెట్టుబడులను ఒక వ్యాపార నిర్ణయం కంటే ఒక అభ్యాస అనుభవంగా పరిగణించేవారు. ఆయన విశ్వసించినది ఏంటంటే.. యువతలో ఉన్న ఆలోచనలు, ఆవిష్కరణలు దేశాన్ని ముందుకు నడిపిస్తాయని. ఈ దృష్టితోనే ఆయన Paytm, Snapdeal, Ola, Lenskart, FirstCry, Urban Company, Moglix వంటి పలు స్టార్టప్లకు ఆర్థిక, నైతిక మద్దతు అందించారు. ఉదాహరణకు.. మొబైల్ రీఛార్జ్ ప్లాట్ఫారమ్గా ప్రారంభమైన Paytm ఇప్పుడు ఒక ప్రధాన ఫిన్టెక్ దిగ్గజంగా ఎదిగి 9 శాతం మార్కెట్ షేర్ కలిగి ఉంది. ప్రస్తుతం అది నెలకు 1.2 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. ఇది భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు టాటా దూరదృష్టి ఇచ్చిన సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు.
అలాగే, ఆయన మద్దతుతో Ola భారతదేశపు రైడ్-హెయిలింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ సంస్థ తరువాత Ola Electric దాని AI విభాగం Krutrim వంటి కొత్త దిశలను ఆవిష్కరించి.. ఉబర్ వంటి అంతర్జాతీయ కంపెనీలకు ప్రతిష్టాత్మక పోటీదారుగా ఎదిగింది.
అయితే రతన్ టాటా కథ కేవలం పెట్టుబడుల గురించే కాకుండా మానవతా విలువల గురించి కూడా అనేక పాఠాలు నేర్పిస్తుంది. ఒకసారి టాటా ఎల్క్సీ కంపెనీలో పనిచేస్తున్న యువ డిజైన్ ఇంజనీర్ శంతను నాయుడు వీధి కుక్కల ప్రాణాలను రక్షించేందుకు సేఫ్టీ కాలర్ల ప్రాజెక్ట్ గురించి టాటాకు లేఖ రాశాడు. ఆ యువకుడి ఆలోచన ఆయనను ఆకట్టుకుంది. కొద్ది కాలంలో నాయుడు టాటాకు ఆత్మీయుడయ్యాడు, తద్వారా ఆయన స్టార్టప్ Goodfellows.. వృద్ధులకు తోడుగా ఉండే సేవకు రతన్ టాటా పెట్టుబడులు పెట్టారు.
ఈ సంఘటన ఆయన హృదయంలో ఉన్న సున్నితత్వాన్ని, యువతపై ఉన్న నమ్మకాన్ని స్పష్టం చేస్తుంది.రతన్ టాటా ఇప్పటివరకు 40కి పైగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. వీటిలో చాలా వరకూ నేడు యూనికార్న్ స్థాయికి చేరుకున్నాయి. ఆయన దృష్టిలో వ్యాపారం కేవలం లాభాల కోసం కాదు.సమాజానికి విలువ సృష్టించడానికేనని Ratan Tata ఎన్నోసార్లు చెప్పారు.
ఇంకా ఆయన ఆధ్వర్యంలోని టాటా ట్రస్ట్లు, టాటా సన్స్లో సుమారు 66 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ట్రస్ట్లు విద్య, ఆరోగ్య సంరక్షణ, గ్రామీణ అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధనలను ప్రోత్సహించేందుకు తమ లాభాలను వినియోగిస్తున్నాయి. ఇది రతన్ టాటా సిద్దాంతాల నడుమ నిలిచిన సమాజ సేవే వ్యాపారం యొక్క నిజమైన అర్థం అనే సిద్ధాంతానికి జీవమూర్తిగా చెప్పుకోవచ్చు. రతన్ టాటా కథ అనేది నమ్మకం, నైతికత, ఆవిష్కరణల మేళవింపు. ఆయన నమ్మిన స్టార్టప్లు కేవలం వ్యాపార విజయాలు సాధించలేదు. భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక పటంలో కొత్త స్థాయికి చేర్చాయి. ఆయన పెట్టుబడులు నేటి యువతకు ఒక పాఠం. మంచి ఆలోచనలకు నమ్మకం ఇచ్చే ఒక వ్యక్తి దేశ భవిష్యత్తును మార్చగలడని నిరూపించిన అజరామర సత్యం.


Click it and Unblock the Notifications