విశాఖలోని ఆ ప్లాట్ సహా... గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు భారీ షాక్! ఆయనకు సంబంధించిన కొన్ని ఆస్తులు వేలానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇండియన్ బ్యాంకు నుంచి ప్రత్యూష సంస్థ భారీ రుణం తీసుకుంది. దీనిని ఇప్పటి వరకు చెల్లించలేదు. నోటీసులు జారీ చేసినప్పటికీ రుణం రీ-పేమెంట్ చేయలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈ కంపెనీ ఆస్తులు వేలం వేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రత్యూష సంస్థ ఆస్తుల వేలానికి సంబంధించి బ్యాంకు నోటీసు విడుదల చేసింది.
అనూహ్యంగా కొద్దిరోజుల్లో బంగారం ధర రూ.2,000 ఎందుకు తగ్గింది?
గంటా ఆస్తులు వేలం
ఇండియన్ బ్యాంకు నుంచి ప్రత్యూష సంస్థ రూ.209 కోట్ల మేర రుణాలు తీసుకుంది. అయితే తనఖా పెట్టిన ఆస్తుల విలువ రూ.35.35 కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా బకాయిల కోసం వ్యక్తిగత ఆస్తులు స్వాధీనంచేసుకునే హక్కు కూడా ఉందని బ్యాంకు చెబుతోంది. అంటే మిగతా మొత్తం కోసం గంటాకు చెందిన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని బ్యాంకు నిర్ణయించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఆ ఫ్లాట్ వేలం వేసే ఛాన్స్
ప్రత్యూష సంస్థకు చెందిన రుణాలు చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4వ తేదీన బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసులు పంపించారు. కానీ ఆ సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదట. దీంతో ఆస్తులను డిసెంబర్ 20వ తేదీన వేలం వేయాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్ను వేలం వేయనున్నారట.
బకాయిలు చెల్లిస్తే...
వేలం గడువులోగా గంటా శ్రీనివాస రావు బకాయిలు చెల్లించేందుకు ముందుకు వస్తే మాత్రం వేలం నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రభుత్వ భూములు తనఖా పెట్టి రుణాలు తీసుకున్నట్లుగా గతంలో గంటాపై ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ రుణానికి సంబంధించి వాటితో లింక్ లేదని అధికారులు చెబుతున్నారు.