Tomato: టమాటా ధరలతో పాటు అవి కూడా పెరుగుతాయా.. ఇక వడ్డీ రేట్ల మోత తప్పదా..!
ఆహార వస్తువుల ధరల పెరుగుదల మధ్య జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.వినియోగదారుల ద్రవ్యోల్బణం మేలో 4.5%కి తగ్గింది. ఇది 25 నెలల్లో కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆహార వస్తులతో కూరగాయల ధరలు భారీగా పెరుగుతుండడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ రోజువారీగా పర్యవేక్షిస్తున్న 22 వస్తువులలో తృణధాన్యాలు, కీలకమైన కూరగాయలు, పప్పులు ఉన్నాయి.
జూన్లో టమాటా ధరలు రెండింతలు పెరిగాయి. మేలో కిలో టమాటా రూ.26 నుంచి సగటున రూ.58కి పెరిగింది. జులై 7 నాటికి టమాటా కిలో రూ.83.3కి పెరిగింది. ప్రస్తతం టమాటా ధర కిలో రూ. 150 రూపాయల కంటే ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల రూ. 100 ఉంది. టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు మరికొన్ని కూరగాయల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకు కూరల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఉత్తర భారతంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో అక్కడ కూరగాయల చేన్లు దెబ్బతిన్నాయని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్కె సింగ్ చెప్పారు. అక్కడ నుంచి వచ్చే కూరగాయల ధరలు మరింత పెరగవచ్చని చెప్పారు. ఇందులో క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, ఆకు కూరలు మరియు క్యాప్సికం వంటి కూరగాయలు ఉన్నాయని తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యాప్సికమ్ ప్రధాన సరఫరాదారు అని చెప్పారు. వర్షాలకు పంటలు నాశనమవడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. దీంతో రవాణా ఇబ్బందిగా మారింది. పచ్చి మిర్చి ధర కూడా భారీగానే ఉంది. పచ్చి మిర్చి కిలో రూ. 120 నుంచి రూ.150 పలుకుతోంది. అల్లం ధర కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక వేళ్ ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్లను మరోసారి పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications