జీఎస్టీ పరిధిలోకి.. ఆహార ధాన్యాలు! ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచన...
ఆహార ధాన్యాలు.. వస్తువులు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి రానున్నాయా? ఈ దిశగా కేంద్రం యోచిస్తోందా? అంటే.. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆహార ధాన్యాలను.. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
ప్రస్తుతం ఈ ఆహార ధాన్యాలు వాల్యూ యాడెడ్ ట్యాక్స్(వాట్) అంటే.. విలువ జోడించిన పన్ను పరిధిలో ఉన్నాయి. అయితే 'రివర్స్ ఛార్జ్ మెకానిజమ్'(ఆర్సీఎం) ఆధారంగా ఆహార ధాన్యాలపైనా జీఎస్టీని వర్తింపజేసే అంశాన్ని అత్యున్నత స్థాయి కమిటీ ఒకటి పరిశీలిస్తోంది.
పలు వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్ల కోత నేపథ్యంలో.. ఈ అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే.. జీఎస్టీ వసూళ్లు రానురాను తగ్గిపోతున్నాయి. 2019 అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లకు తగ్గిపోయింది. గత ఏడాది ఇదే నెలలో.. అంటే 2018 అక్టోబరులో ఇవి రూ.1,00,710 కోట్లుగా ఉన్నాయి.
అలాగే 2019 సెప్టెంబరు నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.91,916 కోట్లుగా, ఆగస్టు నెలలో రూ.98,202 కోట్లుగా ఉన్నాయి. మళ్లీ అక్టోబరుకు వచ్చేసరికి జీఎస్టీ ఆదాయం కేవలం రూ.95,380 కోట్లు మాత్రమే వసూలైంది. దీంతో జీఎస్టీ వసూళ్లు పెంచేందుకు ఒక పరిష్కారాన్ని సూచించాల్సిందిగా కేంద్రంలోని మోడీ సర్కారు ఒక అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ అత్యున్నత స్థాయి కమిటీలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అయిదుగురు సభ్యులు, పలు రాష్ట్రాల ఆర్థిక శాఖల నుంచి మరో అయిదు మంది సభ్యులతోపాటు మొత్తం 12 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ సూచనల ఆధారంగా తుది నిర్ణయాన్ని వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది.
నిజానికి జీఎస్టీ అమలుకు ముందు.. ఆహార ధాన్యాల విషయంలో టోకు వర్తకులపై కొనుగోలు పన్ను విధించేవారు. జీఎస్టీ అమలులోకి వచ్చాక వీటికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ ఆహార ధాన్యాలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'రివర్స్ ఛార్జ్ మెకానిజమ్' కింద నమోదైన సంస్థలు, నమోదు కాని సంస్థలకు మారుగా జీఎస్టీని చెల్లించవచ్చంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు.