చిన్న నగరాల్లో పెరిగిన ఫుడ్ డెలివరీ.. మెట్రోలో మాత్రం తగ్గింపు.. ఎందుకంటే..
కరోనా వైరస్ పుణ్యాన వ్యవస్థల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కొందరు ఉద్యోగాలు పోతే.. సంస్థలు కనుమరుగయి పోయాయి. అయితే అవకాశం ఉన్న వారు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. దీంతో మెట్రో నగరాలు కాస్త ఖాళీగానే ఉన్నాయి. దీంతో అక్కడ ఫుడ్ డెలివరీ గణనీయంగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని స్విగ్గీ, జొమాటో చెబుతున్నాయి. అయితే అదే సమయంలో.. చిన్న నగరాల్లో మాత్రం ఫుడ్ డెలివరీ పెరిగిందని పేర్కొన్నాయి.
వైరస్ వల్ల మెట్రో సిటీస్ నుంచి చాలా మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. దీంతో చిన్న నగరాల్లో ఫుడ్ డెలివరీలు రెట్టింపు అయ్యాయి. ఈ విషయాన్ని స్విగ్గీ, జొమాటో ప్రకటించాయి. కోల్కతా, కొచ్చి, లక్నో, వైజాగ్, గువాహటి, మైసూరు వంటి నగరాల్లో కరోనా వైరస్ కన్నాముందుకంటే ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయని స్విగ్గీ వెల్లడించింది. అయితే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల్లో మాత్రం డెలివరీలు పడిపోతున్నాయని చెబుతున్నాయి.
సిటీల నుంచి ఆర్డర్ల సంఖ్య తక్కువగా ఉందని జొమాటో పేర్కొంది. చిన్న నగరాల్లోనే బిజినెస్ బాగుందని స్పష్టం చేసింది. గతంలో మెట్రో నగరాల్లో యాప్ వాడిన వారిలో చాలా మంది ఇప్పుడు చిన్న సిటీల్లో ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. చిన్న నగరాలకు వెళ్లిపోయిన వారిలో మూడింత ఒక వంతు మంది అక్కడి నుంచే ఆర్డర్లు ఇస్తున్నారని జొమాటో పేర్కొంది. పాట్నా, జంషెడ్పూర్, రాంచీ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయని తెలియజేసింది.