Biscuit Stock: అదరగొడుతున్న బిస్కెట్ కంపెనీ.. సరికొత్త రికార్డులకు షేర్ ధర..
Biscuit Stock: కొత్తనెల వస్తున్న తరణంలో ఇన్వెస్టర్లలోనూ సంతోషం వెల్లివిరుస్తోంది. దలాల్ స్ట్రీట్ లోని అనేక లిస్టెడ్ కంపెనీలు రంకెలు వేస్తూ.. కొత్త గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి. తాజాగా FMCG రంగంలోని ప్రసిద్ధ కంపెనీ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తోంది.
తియ్యటి కబురు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది వాడియా గ్రూప్ నేతృత్వంలోని బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించి. అనూహ్య లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ ఈరోజు మార్కెట్లో 2 శాతం పెరిగి రూ.4300 మార్కును తాకింది. బ్రిటానియాను డివిడెండ్ కింగ్ స్టాక్ అని పిలుస్తారు.
గరిష్ఠాలకు చేరుకున్న స్టాక్..
ఈ రోజు మార్కెట్ ప్రారంభ సమయంలో బ్రిటానియా స్టాక్ ధర రూ.4300.80 స్థాయికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో స్టాక్ ధర రూ.4,273 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతోంది. అయితే స్టాక్ ఉదయం 52 వారాల గరిష్ఠాన్ని చేరుకోవటంపై ఇన్వెస్టర్లు సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.లక్ష కోట్లకు పైగానే ఉంది. బ్రిటానియా స్టాక్ ఈ ఏడాది మార్చిలో కనిష్ఠాల నుంచి ప్రస్తుతం 41 శాతం లాభపడింది. ఏడాది ప్రాతిపదికన కంపెనీ ఈ సంవత్సరం 19 శాతం పెరిగింది.
కంపెనీ లాభాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.493.28 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.384.22 కోట్లుగా ఉంది. అలాగే సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటానియా ఆదాయం రూ.4337.59 కోట్లుగా ఉంది.
ఎండీ ఏమంటున్నారంటే..
గత కొన్ని నెలలుగా సానుకూల వృద్ధిని నమోదు చేసినట్లు ఆర్థిక ఫలితాలపై కంపెనీ MD వరుణ్ బెర్రీ వ్యాఖ్యానించారు. కంపెనీ ఫాలో అయిన గోటూ మార్కెట్, పంపిణీ పెంపు వ్యూహాలు దీనికి కారణంగా నిలిచాయని ఆయన అన్నారు. కంపెనీ ఏడాది ప్రాతిపదికన 22 శాతం వృద్ధిని నమోదు చేయటం వెనుక కారణం ఇదేనన్నారు. FY22లో ఇన్వెస్టర్లకు బ్రిటానియా 5650 శాతం డివిడెండ్ చెల్లించింది. అంటే ఒక్కో షేరుపై రూ.56.50ను ఇన్వెస్టర్లు పొందారు.