మార్చి నాటికి ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం అమ్మకం: నిర్మలా సీతారామన్
ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్లోని వాటాలను 2020 మార్చి వాటికి విక్రయిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఇంగ్లీష్ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అవి పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు.
ఎయిర్ ఇండియాకు మార్చి నెలాఖరు నాటికి సుమారు రూ.58వేల కోట్ల మేర అప్పులు ఉన్నాయి. ఇందులో 76 శాతం వాటాను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది మార్చిలోనే ఎయిర్ ఇండియా అమ్మకానికి సిద్ధమైంది. కానీ వాటా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఇప్పుడు ఎయిర్ ఇండియాను 100 శాతం ప్రయివేటీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్రమంంత్రి హర్దీప్ సింగ్ గత ఆగస్టులో ప్రకటన చేశారు. దీనిని సొంతం చేసుకునేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు కూడా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ ఖర్చులో రూ.4600 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇంధన ధరలు పెరగడం వంటి వివిధ కారణాల వల్ల ఈ నష్టం వాటిల్లింది.
ఇక, భారత్ పెట్రోలియంలోను ప్రభుత్వానికి 53.29 శాతం వాటా ఉండగా, వీటిని విక్రయించేందుకు అక్టోబర్ నెలలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.02 లక్షల కోట్లుగా ఉంది. ప్రభుత్వ వాటా 53.29 శాతం వాటా సుమారు రూ.65 వేల కోట్ల వ్యాల్యూగా ఉంది.