ఆర్థిక ప్యాకేజీ, బ్యాడ్ బ్యాంకు...: నిర్మలా సీతారామన్ ఏం ప్రకటించబోతున్నారు?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేడు(జూన్ 28, సోమవారం) మీడియా ముందుకు రానున్నారు. నిర్మలమ్మ కరోనా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు అంశానికి సంబంధించి మాట్లాడనున్నారని అంచనా. గత ఏడాది కరోనా కారణంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పలుమార్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల సెకండ్ వేవ్ కూడా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టాక కేంద్రం ఆర్థిక ప్యాకేజీతో ముందుకు వస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. తాజాగా నిర్మలమ్మ మీడియా ముందుకు రావడం ఆర్థిక ప్యాకేజీ ప్రకటనకేనని భావిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా దారుణంగా దెబ్బతిన్న వివిధ రంగాలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, కేంద్రం బ్యాడ్ బ్యాంకు నిర్మాణం కోసం రూ.31,000 కోట్లను కేటాయించింది. కరోనా నేపథ్యంలో దెబ్బతిన్న వివిధ రంగాలు, కార్మికులు, ఉద్యోగులు కూడా పలు రకాల డిమాండ్లతో ముందుకు వస్తున్నారు.
తమ తమ రంగాలను ఆదుకోవాలని వివిధ రంగాలు కోరుతున్నాయి. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారెంటీ స్కీంను రూ.3 లక్షల నుండి రూ.5 లక్షలకు పెంచాలని కంపెనీలు కోరుతున్నాయి. లోన్ మారటోరియం మరోసారి ఇవ్వాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ ఏం ప్రకటన చేస్తారోననే ఆసక్తి అందరిలోను నెలకొంది.