ప్రపంచ మోస్ట్ పవర్ఫుల్ 100 జాబితాలో నిర్మలా సీతారామన్, నాయర్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో నిలిచారు. 2020లో 41వ స్థానంలో, 2019లో 34వ స్థానంలో నిలిచారు నిర్మలమ్మ. తొలి పూర్తిస్థాయి ఆర్థికమంత్రి అయిన నిర్మల ఈ జాబితాలో స్థానం పొందడం వరుసగా మూడోసారి. ఈ మేరకు ఫోర్బ్స్ 18వ వార్షిక ర్యాంకింగ్స్ను ప్రకటించింది. సౌందర్య ఉత్పత్తుల రంగంలోని నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ ఈ జాబితాలోకి మొదటిసారి వచ్చారు. వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ వుమెన్ జాబితాలో అమెరికా రచయిత్రి, దాతృత్వంలో పేరొందిన మెకంజీ స్కాట్ మొదటి స్థానంలో నిలిచారు. మాజీ జర్మన్ ఛాన్సులర్ ఎంజేల్ మోర్కెల్ స్థానాన్ని ఆమె భర్తి చేశారు. ఇప్పటి వరకు 17సార్లు ఈ జాబితాను వెలువరించగా 15సార్లు మెర్కెల్ మొదటి స్థానంలో నిలిచారు.
అమెరికా ఆర్థికమంత్రి జానెట్ ఎల్లెన్ కంటే నిర్మలమ్మ రెండు స్థానాలు పైన ఉన్నారు. ప్రపంచ శక్తిమంత మహిళల జాబితాలో మెకంజీ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (2), యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు ప్రెసిడెంట్ క్రిస్టిన్ లగార్డే (3), మ్యారీ బర్రా(4), మిలిండా గేట్స్(5) ఉన్నారు. హెచ్సీఎల్ కార్పోరేషన్ సీఈవో రోషిణి నాయర్ 52వ స్థానంలో, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందర్ షా 72వ స్థానంలో ఉన్నారు.
భారత్లో తొలి, పూర్తి స్థాయి ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్, రాజకీయాల్లోకి రాకముందు అగ్రికల్చర్ ఇంజినీర్స్ అసోసియేషన్, బీబీసీ వరల్డ్ సర్వీస్లలో కీలక పదవులు నిర్వర్తించారు. ఇక, మాజీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఫల్గుణి ఉద్యోగాన్ని వదులుకొని, 2012లో నైకాను ప్రారంభించారు. ఇటీవల సంస్థ ఐపీవోకు రాగా మంచి స్పందన లభించింది. ఈమె నికర సంపద రూ.710 కోట్ల డాలర్లకు చేరుకుంది.