అత్యంత తక్కువ ధరకే విమాన టికెట్.. సామాన్యుల కోసం సంచలన ఆఫర్ తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా..
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే ఎకానమీ-క్లాస్ ప్రయాణికుల కోసం ఒక సరికొత్త మార్పును తీసుకువచ్చింది. విమాన ప్రయాణంలో భోజనం వదులుకోవడానికి సిద్ధంగా ఉండే ప్రయాణికుల కోసం 'బేసిక్' పేరుతో ఒక కొత్త ఛార్జీల విభాగాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రయాణికులు భోజనం లేని టిక్కెట్ను ఎంచుకుని, సాధారణ ధర కంటే తక్కువ ఛార్జీలకే ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది.
తాము ప్రవేశపెట్టిన ఈ కొత్త కేటగిరీ ద్వారా వినియోగదారులు తాము ఎలా ప్రయాణించాలి, దేనికి ఎంత చెల్లించాలి అనే విషయాలపై మరింత నియంత్రణ కలిగి ఉంటారని ఎయిర్ ఇండియా ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు ఎకానమీ క్లాస్లో అందుబాటులో ఉన్న వాల్యూ, క్లాసిక్ మరియు ఫ్లెక్స్ కేటగిరీలతో పాటు, ఈ కొత్త విభాగం చేరడంతో ఇప్పుడు మొత్తం నాల్గవ ఛార్జీ ఎంపిక అందుబాటులోకి వచ్చినట్లయింది.

ఈ 'బేసిక్' కేటగిరీ కింద భోజనం లేని ఆప్షన్ను ఎంచుకునే ప్రయాణికులు, భోజనంతో కూడిన సాధారణ ఎకానమీ టిక్కెట్లను బుక్ చేసుకునే వారి కంటే తక్కువ టికెట్ ధర చెల్లిస్తారు. భోజనం నిలిపివేసినప్పటికీ ఈ టిక్కెట్పై 15 కేజీల చెక్డ్ బ్యాగేజ్ మరియు 7 కేజీల క్యాబిన్ బ్యాగేజ్ అనుమతి యథాతథంగా ఉంటుంది. అలాగే విమానంలో ఉచిత పానీయాల సేవలు అంటే టీ లేదా కాఫీ మాత్రం ప్రయాణికులందరికీ అందుబాటులో ఉంటాయి.
ఒకవేళ బేసిక్ ఛార్జీపై టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆ తర్వాత భోజనం కావాలనుకుంటే, విమానంచేరడానికి 24 గంటల ముందు వరకు శాకాహారం, మాంసాహారం, జైన మరియు మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రత్యేక భోజనాలను అదనపు ధర చెల్లించి ముందుగానే కొనుగోలు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఎయిర్ ఇండియా ప్రస్తుతం ప్రాథమికంగా ఢిల్లీ-చండీగఢ్ మరియు ఢిల్లీ-ఉదయ్పూర్ వంటి సుమారు 15 నుండి 20 స్వల్ప-దూర దేశీయ మార్గాల్లో ఈ విభాగాన్ని పైలట్ దశలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. తక్కువ దూర ప్రయాణాలు చేసే వారు విమానంలో భోజనం కంటే తక్కువ ధరకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, అందువల్ల ఈ ఆఫర్ వారిని బాగా ఆకర్షిస్తుందని సంస్థ భావిస్తోంది. ఈ పైలట్ దశలో లభించే వినియోగదారుల స్పందన మరియు అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్తులో దీనిని మరిన్ని రూట్లకు విస్తరించడంపై నిర్ణయాలు తీసుకుంటారు.
అయితే, ఈ మార్పు కేవలం ఎకానమీ-క్లాస్ ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుందని, బిజినెస్ క్లాస్ లేదా ప్రీమియం ఎకానమీ క్యాబిన్లలో ఇటువంటి మార్పులు ఏవీ లేవని ఎయిర్లైన్ స్పష్టం చేసింది. ఇది ఖర్చులు తగ్గించుకోవడానికి చేసిన పని కాదని, వినియోగదారులకు తమ అవసరాలకు తగ్గట్లుగా ప్రయాణాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వడం కోసమే తీసుకున్న చొరవ అని ఎయిర్ ఇండియా వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications
