90 నిమిషాల్లో ఇంటికి నిత్యావసరాల డెలివరీ.. మినిమం డెలివరీ చార్జ్ రూ.29
బెంగళూరు: ఆర్డర్ ఇచ్చిన గంటన్నర వ్యవధిలోనే నిత్యావసరాలను ఇంటికి డెలివరీ చేసే ఫ్లిప్కార్డ్ క్విక్ సేవలను ప్రారంభించింది ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసిన నిత్యావసర వస్తువులను అమెజాన్ ఇండియా, జియో మార్ట్ డెలివరీ చేస్తోన్న విషయం తెలిసిందే. వీటికి పోటీనిచ్చే విధంగా ఫ్లిప్కార్ట్ క్విక్ పేరుతో ముందుకు వచ్చింది. బెంగళూరులో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. త్వరలో ఆరు నగరాలకు విస్తరించనున్నది.
ఆఫీస్లకు టెక్కీలు.. ఎవరు వస్తారు.. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్? డిసైడ్ చేస్తున్న ఐటీ కంపెనీలు
2000 రకాల ఉత్పత్తుల డెలివరీ
నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులు, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్టేషనరీ, ఇంట్లో వినియోగించే పరికరాలు, మటన్, చికెన్ వంటి రెండువేల రకాల ఉత్పత్తులను ఈ ఫ్లిప్కార్ట్ క్విక్ సేవల కింద సరఫరా చేయనున్నట్లు తెలిపింది. బెంగళూరులో కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రారంభించింది. వైట్ ఫీల్డ్, పనతూరు, హెచ్ఎస్ఆర్ లే అవుట్, బీటీఎం లేఅవుట్, బానాశంకరి, కేఆర్ పురమ్, ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ ఏడాది చివరి నాటికి ఆరు ప్రధాన నగరాల్లో విస్తరించనున్నట్లు వెల్లడించింది.
గంటన్నరలో డెలివరీ కోసం.. డెలివరీ ఛార్జీ
90 నిమిషాల్లోనే డెలివరీ కోసం షాడోఫాక్స్ సంస్థతో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది. సొంత లాజిస్టిక్ విభాగం ఈకార్ట్ను కూడా ఉపయోగించుకోనుంది. క్రమంగా ఆయా నగరాలు, పట్టణాలలో విక్రయ సంస్థలతో ఒప్పందం చేసుకొని, సరుకులు త్వరగా చేరవేస్తామని వెల్లడించింది. ఇంటికి దగ్గరగా ఉండే కిరాణా దుకాణంలో ఉండే ఉత్పత్తులన్నీ అందుబాటులో ఉంటాయని, వీటితో పాటు పండ్లు, కూరగాయలు, మాంసం వంటి ఉత్పత్తులను కూడా చేర్చారు. కనీస డెలివరీ ఛార్జీని రూ.29గా నిర్ణయించింది.
అర్ధరాత్రి దాకా సేవలు
విక్రయదారులకు నిల్వ చేసుకోవడానికి అవసరమైన గిడ్డంగులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. హైపర్ లోకల్ డెలివరీ విభాగంలో మరింత నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తామని తెలిపింది. నాణ్యత, సర్వీస్ ప్రమాణాలకు ప్రాధాన్యత ఇచ్చే స్థానిక స్టోర్స్తో కలిసి పని చేస్తామని తెలిపింది. కస్టమర్లు తమ అవసరాన్ని బట్టి గంటన్నర లేదా రెండు గంటల స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఉదయం ఆరు గంటల నుండి అర్ధరాత్రి వరకు సర్వీస్ ఉంటుంది. కాగా ఇప్పటికే అమెజాన్, బిగ్ బాస్కెట్ వేగంగా డెలివరీ అందిస్తున్నాయి. ఇటీవల వచ్చిన జియో మార్ట్ దూసుకెళ్తుందని భావిస్తున్నారు. వీటితో పాటు డుంజో, స్విగ్గీ కూడా గ్రోసరీ సేవలు అందిస్తున్నాయి.