విమాన ప్రయాణికులకు షాక్! మళ్లీ పెరగనున్న ఫ్లైట్ టికెట్ ధరలు.. అసలు కారణం ఇదే!
మీరు రాబోయే రోజుల్లో ఎక్కడికైనా విమానంలో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ జేబుకు కాస్త ఎక్కువ చిల్లు పడే అవకాశం కనిపిస్తోంది. దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ లాంటి బ్యాడ్ న్యూస్ చెప్పింది. విమాన ఇంధనం అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దాదాపు 10 శాతం మేర పెంచేశాయి. ఈ ప్రభావం నేరుగా సాధారణ ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంధన ధరలు పెరిగితే కంపెనీలు ఆ భారాన్ని ఫ్లైట్ టికెట్ (flight ticket) రూపంలో కస్టమర్ల పైనే వేస్తాయి.
అయితే, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా మారుతున్న నేపథ్యంలో విమానయాన సంస్థలను, ప్రయాణికులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త 'ధరల స్థిరీకరణ పథకాన్ని' (Price Stabilisation Scheme) తీసుకొచ్చింది. దీని ప్రకారం విమాన సంస్థలు తమ ఇంధన ధరలను మూడు సంవత్సరాల వరకు ఒకే రేటు వద్ద లాక్ చేసుకోవచ్చు.

కొత్త రూల్స్ ఏంటి? లీటర్ ధర ఎంతంటే?
ఈ కొత్త వాలంటరీ (ఐచ్ఛిక) స్కీమ్ కింద, ఇందులో చేరే విమానయాన సంస్థలు లీటర్ ఏటీఎఫ్ (ATF) కు రూ.115 స్థిర ధర చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఇది రూ.104.927 గా ఉండేది. అంటే దాదాపు 10 శాతం పెరిగింది.
- ఈ పథకంలో చేరిన కంపెనీలకు అంతర్జాతీయంగా రేట్లు ఎంత పెరిగినా మూడేళ్ల వరకు లీటర్ రూ.115 కే ఇంధనం లభిస్తుంది.
- ఒకవేళ ఈ స్కీమ్లో చేరకుండా విడిగా మార్కెట్ రేటుకే కొంటామనే కంపెనీలకు ప్రస్తుతం లీటర్ ధర రూ.142Palగా ఉంది.
ఈ స్థిర ధరల ఫార్ములా ప్రకారం.. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ ATF ధర రూ.115, ముంబైలో రూ.114.5, చెన్నైలో రూ.139 గా మారనుంది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగినా, దేశంలో గత రెండు నెలలుగా రేట్లు పెంచకపోవడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోయాయి. అందుకే ఈ కొత్త మార్పులు చేయాల్సి వచ్చింది.
రూ.10,000 కోట్ల ప్యాకేజీ.. ప్రయాణికులకు లాభమా? నష్టమా?
ఈ ధరల హెచ్చుతగ్గుల నుంచి విమానయాన రంగాన్ని రక్షించడానికి కేంద్ర క్యాబినెట్ రూ.10,000 కోట్లతో ఈ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫ్రేమ్వర్క్ను ఆమోదించింది. అంతర్జాతీయంగా రేట్లు పెరిగినప్పుడు ప్రభుత్వం చమురు కంపెనీలకు వడ్డీ లేని అడ్వాన్స్ ఇస్తుంది. రేట్లు తగ్గినప్పుడు ఆ డబ్బును మళ్లీ వెనక్కి తీసుకుంటుంది. ఇది సబ్సిడీ కాదు, కేవలం ధరలను కంట్రోల్ చేయడానికి తెచ్చిన ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.
విమాన కంపెనీల మొత్తం నిర్వహణ ఖర్చులలో (Operating Expenses) కేవలం ఇంధనానికే 40 శాతం నుండి 60 శాతం వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి, తాజా 10 శాతం పెంపు వల్ల ఎయిర్లైన్స్ లాభాలపై ఒత్తిడి పెరుగుతుంది. మే నెలలో అంతర్జాతీయంగా జెట్ ఫ్యూయల్ ధర లీటరుకు రూ.142 కి చేరినప్పుడు విమాన ఛార్జీలు భారీగా పెరుగుతాయని అందరూ భయపడ్డారు.
కానీ ఈ కొత్త స్కీమ్ వల్ల కంపెనీలకు ఇంధన ఖర్చులపై ఒక క్లారిటీ ఉంటుంది. ఫలితంగా పీక్ ట్రావెల్ సీజన్లలో కూడా విమాన సంస్థలు అకస్మాత్తుగా ఫ్లైట్ టికెట్ (flight ticket) ధరలను పెంచే అవకాశం తగ్గుతుందని, రేట్లు స్థిరంగా ఉండేలా ఈ ప్లాన్ సహాయపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతానికి ఇంధన ధరలు 10 శాతం పెరగడం వల్ల విమాన టికెట్ల ధరలు కొంత మేర పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో ప్రభుత్వ కొత్త స్కీమ్ వల్ల రేట్లు మరీ దారుణంగా పెరగకుండా కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు ముందే ప్లాన్ చేసుకుని అడ్వాన్స్గా బుకింగ్స్ చేసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.


Click it and Unblock the Notifications