మందగమనం నుంచి బయటపడేందుకు నిర్మలమ్మ ఈ 5 చేయాలి!
ఓ వైపు మందగమనం, మరోవైపు డిమాండ్, వినియోగం తగ్గి కంపెనీలు విలవిల్లాడుతున్నాయి. గత ఏడాది చివరి మూడు నెలల్లో మోడీ ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు సహా ఉద్దీపనలు ప్రకటించింది. అయినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. అందరూ బడ్జెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. సామాన్యుల నుంచి వివిధ రంగాల కంపెనీలు బడ్జెట్ తమకు సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాయి. ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో ఇవి ఉంటే బెట్టర్ అంటూ ఆర్థిక నిపుణులు సూచనలు చేస్తున్నారు. అందులో కొన్ని...
భారత్లో పన్ను తక్కువగా ఉందా: చైనా-అమెరికా-బంగ్లాతో పోలిస్తే.. అసలు కారణం ఇదేనా?
ఖర్చును తగ్గించకూడదు
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉండి ఖర్చులను ఈ మిగిలిన కాలంలో కొనసాగించాలని అంటున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు ఖర్చులు తగ్గించడం సరికాదని చెబుతున్నారు. మధ్యలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులు తగ్గిస్తే ప్రతికూల ఫలితాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
మల్టిపుల్ ప్రయోజనాలు ఉండేలా..
ప్రభుత్వం ఇప్పటి వరకు సప్లై పైనే దృష్టి సారించింది. కార్పోరేట్ తగ్గింపు ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అయితే డిమాండ్ లేకుండా ఉత్పత్తి పెంచినా లాభం లేదు. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గింపు ప్రయోజనాన్ని ఉపయోగించుకునేలా పెట్టుబడులను ఆకర్షించలేదు. రుణ లభ్యత ఉన్నా పెట్టుబడులు పెరగలేదు. కాబట్టి పరిమితంగా ఉన్న నిధులను ఎంపిక చేసిన రంగాలపై ఖర్చు చేయాలని సూచిస్తున్నారు. ఈ ఖర్చుతో మల్టిపుల్ ప్రయోజనాలు ఉండాలి.
పెట్టుబడుల కోసం..
2024-25 ఆర్థిక సంవత్సరానికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ని తయారు చేయాలనేది మోడీ ప్రభుత్వం కల. ఇది నెరవేరాలంటే ప్రయివేటు పెట్టుబడులు అవసరమని అంటున్నారు. అయిదేళ్లలో నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ (NIP) కోసం రూ.102 ట్రిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందులో 2020-21 ఆర్థిక సంవత్సరానికి 19.5 ట్రిలియన్ డాలర్లు కేటాయిస్తున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా చెరో 39 శాతం, ప్రయివేటు పెట్టుబడిదారుల వాటా 22 శాతంగా ఉండనుంది. బ్యాంకింగ్ సెక్టార్ను బలోపేతం చేస్తే ఇది సులభమవుతుందని అంటున్నారు.
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు..
ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు వెల్త్ ట్యాక్స్ తిరిగి ప్రారంభించాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతలు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే పన్ను విధానంలో మార్పుల ద్వారా మార్పు తీసుకు రావొచ్చునని చెబుతున్నారు. అలాగే చిన్న కంపెనీలు, స్టార్టప్స్కు మరింత ప్రోత్సాహం ఉండాలని చెబుతున్నారు.
రాష్ట్రాలకు మరిన్ని అప్పులు తెచ్చుకునే వెసులుబాటు
ఆర్థిక వృద్ధిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చు చేయాలి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు మరిన్ని ఎక్కువ రుణాలు తీసుకొని కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. కేంద్రం సహా చాలా రాష్ట్రాలు మూలధన వ్యయాలు తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నారు. కాబట్టి రాష్ట్రాలు రుణాలు తీసుకునే పరిమితులను పెంచుకోవాలని, అదే సమయంలో వడ్డీ రేట్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.