fiscal deficit fy23: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును 16.61 లక్షల కోట్లకు (జీడీపీలో 6.4 శాతం) పరిమితం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కరోనా సంక్షోభం, సబ్సిడీల వల్ల ఈ ఏడాది కూడా ప్రభుత్వ పథకాలకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది.
తద్వారా గత ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఆర్థిక లోటు 9.93 లక్షల కోట్లకు పెరిగినట్లు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే ముందుగా నిర్ణయించిన లక్ష్యంలో 59.8 శాతమని డేటా వెల్లడించింది.

వచ్చే ఏడాది అంచనా
క్రితం ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల లోటును అప్పటి లక్ష్యంతో పోలిస్తే కేవలం 50.4 శాతం మాత్రమే లోటు నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది చివరి నాటికి ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకోగలమని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా.. వచ్చే ఏడాది ద్రవ్యలోటు లక్ష్యాన్ని GDPలో 5.9 శాతంగా నిర్ణయించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఆదాయం ఇంత..
గత తొమ్మిది నెలల్లో నికర పన్ను ఆదాయం 15.55 లక్షల కోట్లు అని కేంద్రం వెల్లడించింది. మొత్తం ఆర్థిక సంవత్సరం అంచనాలో ఇది 80.4 శాతమని పేర్కొంది. పన్నేతర రాబడితో కలిపి ఏప్రిల్-డిసెంబర్ కాలానికి మొత్తం ఆదాయం 17.69 లక్షల కోట్లని తెలిపింది.
పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా డిసెంబర్ చివరి నాటికి 31 వేల కోట్లకు పైగా సమీకరించినట్లు ప్రకటించింది. అంటే 65 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా.. అంచనాలను అందుకోవడంలో విఫలమై 48 శాతం మాత్రమే సాధించగలిగింది.

వ్యయం అంత..
ఇక వ్యయం విషయానికొస్తే.. ఈ ఏడాది బడ్జెట్ అంచనాలో 71 శాతానికి పైగా (28.18 లక్షల కోట్లను) డిసెంబరు వరకు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మూలధన వ్యయం దాదాపు 5 లక్షల కోట్లు (ఏడాది అంచనాలో 65.4 శాతం) కాగా.. అంతకు ముందు ఏడాది 3.9 లక్షల కోట్లు అని పేర్కొంది. గత 9 నెలల్లో ప్రభుత్వ మార్కెట్ రుణాలు 8.85 లక్షల కోట్ల రూపాయలకు పెరిగాయని వెల్లడించింది.


Click it and Unblock the Notifications