ఆ ప్యాకేజీ సరిపోదు, ఆ రెండే కరోనా సంక్షోభం నుండి కాస్త గట్టెక్కిస్తాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపన సరిపోదని, మరింత ఆర్థిక ప్యాకేజీ కావాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా అసాధారణ సంక్షోభమని, ద్రవ్యలోటు అదుపు తప్పుతుందని హెచ్చరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం, రాష్ట్రాల ద్రవ్యలోటు 14 శాతానికి చేరుకోవచ్చునని అంచనా వేశారు. న్యూఢిల్లీలో మంతన్ ఫౌండేషన్ నిర్వహించిన 'ది చాలెంజ్ ఆఫ్ ది కరోనా క్రైసిస్-ఎకనమిక్ డైమెన్షన్స్'లో సుబ్బారావు వెబ్నార్ ద్వారా పాల్గొని, ప్రసంగించారు.
50 రోజులుగా క్లోజ్, అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం
ఆర్థిక ప్యాకేజీ సరిపోదు
మార్చి 26వ తేదీన కేంద్రం ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ సరిపోదని సుబ్బారావు చెప్పారు. ఇది దేశ జీడీపీ వ్యాల్యూలో కేవలం 0.8% అన్నారు. మరింత ప్యాకేజీ కేటాయించాలన్నారు. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజల పొదుపు మొత్తాలు ఆవిరయ్యాయని, వారికి పూర్తిస్థాయి సహకారం అందించాలన్నారు. కరోనా సంక్షోభం ఏర్పడినా మన వద్ద వ్యవసాయ దిగుబడి పెరిగిందని, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, పరిశ్రమలు తెరుచుకున్నాయని చెప్పారు.
కేంద్రం మరింత ఖర్చు చేయాలి
ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆదుకోవడం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం, ప్రయివేటు సంస్థలకు బ్యాంక్ గ్యారెంటీని అందించడం వంటి అంశాలపై కేంద్రం దృష్టి పెట్టాలన్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం మరింత ఖర్చు చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఖర్చులు పెంచక తప్పదన్నారు. జీడీపీలో 2.1% వరకు అప్పులు తీసుకోవచ్చునని, ద్రవ్యలోటు పది శాతం కంటే మించి ఉండవచ్చునన్నారు.
అలా చేస్తే మరిన్ని అనర్థాలు
పరిమితికి మించి ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి రుణాలు సేకరించడం సరికాదన్నారు. అలా చేస్తే వడ్డీ రేట్లు పెరిగి మరిన్ని అనర్థాలు తలెత్తవచ్చునని హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రుణ సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం రూ.7.8 లక్షల కోట్ల నుండి రూ.12 లక్షల కోట్లకు పెంచడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బ్యాంకుల వద్ద ఎన్పీఏలు పెరగడంతో ఆశించినమేర అవి రుణాలు మంజూరు చేయడం లేదన్నారు.
ఇది అసాధారణ సంక్షోభం
మార్చి 26న ప్రకటించిన రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి చూస్తుంటే చాలా చిన్నదిగా అనిపిస్తోందని సుబ్బారావు అన్నారు. కాబట్టి మరింత ప్యాకేజీ అవసరమన్నారు. ఇది ముమ్మాటికి అసాధారణ సంక్షోభం అన్నారు.
చమురు, వ్యవసాయ ఉత్పత్తులు కాస్త గట్టెక్కిస్తాయి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్యలోటు జీడీపీలో 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా ఇది 13 శాతం నుండి 14 శాతం వరకు చేరే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహమ్మారి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతోందన్నారు. అదే సమయంలో తగ్గుతున్న చమురు ధర, భారీగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థను కొంత గట్టెక్కిస్తాయన్నారు.
చైనా నుండి కంపెనీలను ఆకర్షించాలి
ప్రస్తుత పరిస్థితుల్లో చైనా నుండి వెళ్లిపోతున్న అమెరికా, ఐరోపా కంపెనీలను భారత్కు రప్పించేందుకు ఇది మంచి అవకాశమని సుబ్బారావు చెప్పారు. రెండేళ్లుగా చైనా నుండి వివిధ సంస్థలు వెళ్లిపోతున్నాయన్నారు. తైవాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, వియత్నాం, పిలిప్సీన్, మలేషియా వంటి దేశాలు ఎన్నో కంపెనీలను ఆకర్షించాయన్నారు. కరోనా తర్వాత గ్లోబలైజేషన్ ముగిసిపోదని, అది కొత్త రూపం సంతరించుకుంటుందని, స్థానిక ప్రభుత్వాలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు.