Financial Fraud: బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ కంపెనీ.. ఇన్వెస్టర్లకు చెందిన రూ.177 కోట్లు స్వాహా..
Financial Fraud: ఒకప్పుడు దొంగలంటే రాత్రిళ్లు ఇళ్లలో పడి చోరీలు చేసేవారు. కానీ.. ఇప్పుడు తెలివైన మోసగాళ్లు ఎక్కువయ్యారు. పెట్టుబడులపై మంచి రాబడులను అందిస్తామంటూ వీరు చేస్తున్న మోసాలు వల్ల వందల సంఖ్యలో సామాన్యులు బలి అవుతున్నారు. దీనికి తోడు.. పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే తపనతో ప్రజలు తొందరపడి తమ ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానే జిల్లాలో చోటుచేసుకుంది. ఇక్కడ పోలీసులు ఆరుగురిపై రూ.1.77 కోట్ల మోసం కేసు నమోదు చేశారు. ఈ వ్యక్తులు తమ ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి మంచి రాబడిని ఇస్తామని నమ్మిచ్చి వందలాది మందిని మోసం చేశారు. ఈ ఫైనాన్స్ కంపెనీలో ఓ డెంటిస్ట్ కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాడని ఓ అధికారి తెలిపారు. దీనిపై సదరు డాక్టర్ ఫిర్యాదు చేయడంతో కల్యాణ్ సమీపంలోని మాన్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
నిందితులు సుప్రీమ్ మ్యూచువల్ బెనిఫిట్ నిధి లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించారు. పెట్టుబడి పథకాలపై మంచి రాబడిని ఇస్తానంటూ ప్రజలను ప్రలోభపెట్టాడు. 2019-2022 మధ్య కాలంలో ఇలా చాలా మంది వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టారు. కానీ.. వారు తమ పెట్టుబడి మొత్తాన్ని కూడా తిరిగి పొందలేదు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. నిందితులు మొత్తం 319 మంది ఇన్వెస్టర్లు, 22 మంది ఏజెంట్లను మోసం చేసి రూ.177 కోట్ల మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
నిందితులను శంకర్ సింగ్, సునీల్ విశ్వకర్మ, కృపాశంకర్ పాండే, రమావద్ వర్మ, రాకేష్ దివాకర్, లాల్ బహదూర్ వర్మగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు హఠాత్తుగా ఒక రోజు ఆఫీసు మూసేసి పారిపోయారు. ప్రస్తుతం స్థానిక పోలీసులు వీరిపై ఐపీసీ 406, 409, 420, 120 B సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలకోసం ఇలాంటి వారి మోసగాళ్ల మాటలు నమ్మి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేయాలంటే ప్రజలు ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.