హైదరాబాద్లో ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్ టెక్ సెంటర్
ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్(FCA) సంస్థ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐటీ సెంటర్ను ఏర్పాటు చేయనుంది. 2,000 సీటింగ్ కెపాసిటీతో దీనిని ఏర్పాటు చేయనుంది. ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ ఇటలీకి చెందిన ప్రముఖ వాహన సంస్థల్లో ఒకటి. ఇప్పుడు హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రెండువేల మంది పని చేయగలిగే ఈ సెంటర్ ఏర్పాటుకు రాయదుర్గంలోని సలార్పురియా నాలెడ్జ్ సిటీని సంస్థ ఎంచుకుందని సమాచారం.
ఇప్పటికే చెన్నై, పుణేలోని టెక్నాలజీ సెంటర్లలో 1500 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సెంటర్ కూడా అందుబాటులోకి వస్తే ఉద్యోగుల సంఖ్య 3500కు చేరుకుంటుంది. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వంద ఉత్పత్తి కేంద్రాలు, 40 ఆర్ అండ్ డీ సెంటర్లు ఉన్నాయి. క్రిస్లర్, ఫియట్ ప్రొఫెషనల్, జీప్, మాసేరాటి బ్రాండ్స్తో వాహనాలన విక్రయిస్తోంది. ఈ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఈ నెల చివరలో సంస్థ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

దేశంలోని ఇతర ఆటో టెక్ కంపెనీల విషయానికి వస్తే మెర్సిడెజ్ బెంజ్ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ బెంగళూరులో ఉంది. ఈ సంస్థకు జర్మనీ బయట ఇదే అతిపెద్ద సెంటర్. హ్యుండాయ్ ఆర్ అండ్ డీసెంటర్ హైదరాబాద్లో ఉంది. మోటార్ సైకిల్స్, స్కూటర్స్ కోసం హోండా ఆర్ అండ్ డీ ఫెసిలిటీ మానేసర్లో ఉంది. బాష్, కాంటినెంటల్, జెడ్ఎఫ్, విస్టన్ సంస్థలు కూడా తమ టెక్ సెంటర్లను ఏర్పాటు చేశాయి.


Click it and Unblock the Notifications