పండుగ సీజన్ లో ఈసారి ప్రజల ఆర్ధిక వ్యయం అంతంతే ...50 శాతం మందికి అనాసక్తి అంటున్న సర్వే
దసరా, దీపావళి పండుగలకు సామాన్యుల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండటంతో ప్రజలు పండుగ షాపింగ్ కు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు . ఈసారి పండుగ సీజన్ లో భారీ అమ్మకాలను ఆశలు పెట్టుకున్నాయి అన్ని వ్యాపార సంస్థలు. కానీ ఈసారి పండుగ సీజన్లో ప్రజలు మాత్రం ఆచితూచి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.
పండుగ షాపింగ్ కు సామాన్యులు దూరం .. ఆకాశాన్నంటిన నిత్యావసరాలు ,కూరగాయల ధరలే కారణం
పండుగ షాపింగ్ విషయంలో ఆసక్తి చూపని ప్రజలు
వ్యాపార సంస్థల ఆశలు నీరుగార్చే వాస్తవాలు ఓ సర్వేలో వెల్లడయ్యాయి . దేశంలో సగం మందికి పైగా కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమయంలో ఆర్థిక వ్యయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా ఓ సర్వే తేల్చింది. దీంతో జోరుగా ఉంటాయనుకుంటున్న అమ్మకాలు అంతగా ఉండకపోవచ్చని సర్వే తేల్చింది. మార్కెట్ పరిశోధన సంస్థ యుగవ్ 10 ప్రాధాన్యత అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని తెలియజేసింది.
2500మందిపై జరిపిన సర్వే ... కొనుగోళ్ళు కష్టమే
సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ ల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,500 మందిని వారి స్థూల ఆదాయంలో పెరుగుదల, తగ్గుదల ఆధారంగా ప్రశ్నించారు . కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం నెలకొందని , ఈసారి పండుగల సీజన్లో కొనుగోళ్లపై వారు పెద్దగా ఆసక్తి చూపించలేదని సర్వే తేల్చింది. పండుగ సీజన్ షాపింగ్ పై వ్యాపారులు పెద్ద ఆశలు పెట్టుకుంటే, ప్రజలు మాత్రం అంతగా ఆసక్తి కనబరచడం లేదని సర్వే వెల్లడించింది.
50 శాతం ప్రజల నుండి నిర్లిప్తత... ఆచి తూచి షాపింగ్
స్థూల ఆదాయం పెరిగింది అన్న వారి సంఖ్య 15 శాతం మాత్రమే ఉందని గతంతో పోలిస్తే వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నామన్న వారు సుమారు 50 శాతం మంది చెప్పారని సర్వే స్పష్టం చేసింది. గత దీపావళి సీజన్ లో పెట్టిన వ్యయాలతో పోలిస్తే ఈసారి తక్కువగా ఖర్చు చేస్తామని 50 శాతం మంది చెప్పడం వ్యాపారస్తుల ఆశలపై నీళ్లు పోసింది. దీపావళి సీజన్ లో పెట్టిన ఖర్చుతో సమానంగా ఖర్చు చేస్తామని చెప్పిన వారు 20 శాతం ఉంటే అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పిన వారు 17 శాతం మంది ఉన్నారని పేర్కొంది .
దీపావళికి షాపింగ్ అంతంత మాత్రమే ..
50 శాతం మంది ఆసక్తి కనబరచనివారు ఉన్నారని వారంతా పండుగ షాపింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారని సర్వేలో వెల్లడైంది .వస్తువులు ,దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఆభరణాలు, హోమ్ అప్లయెన్సెస్ లపై వ్యయ ధోరణులను అంచనా వేసిన యుగవ్ సర్వే ఈ సారి దీపావళికి షాపింగ్ అంతంతే అని సర్వే ద్వారా వెల్లడించింది .