taxation: సరళీకృత పన్ను విధానమే సమగ్రాభివృద్ధికి సోపానం !!
పన్ను చెల్లింపుదారులను సంతృప్తిపరుస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా ఏటా బడ్జెట్ రూపకల్పన జరుగుతుంది. కొన్ని అధిక ఆదాయ వర్గాలను దృష్టిలో పెట్టుకుని వారిపై మరింత పన్నుల భారాన్ని మోపాల్సిన అవసరం ఏర్పడుతుండటం సహజమే. కొత్త వారిని పన్ను పరిధిలోనికి తీసుకువారవాలనుకోవడం కఠిన నిర్ణయమైనా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ విధానం అంత సహేతుకం కాదనే వాదనలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. పలువురు ఆర్థిక నిపుణుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి:
కేవలం 4 శాతమే రిటర్నులు:
135 కోట్ల జనాభా ఉన్న దేశంలో గతేడాది జూలై చివరినాటికి కేవలం 5.8 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్లు మాత్రమే దాఖలయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బారత్ మొత్తం జనాభాలో ఈ సంఖ్య కేవలం 4% మాత్రమే. వార్షికాదాయం కోటి కంటే ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించే వారు కేవలం లక్షా 31 వేల మందే. ఈ గణాంకాలను బట్టి అధికశాతం పన్నులు ఎగ్గొడుతున్నారనే వాస్తవం అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో సమతుల్యం తీసుకురావడం, ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడం కోసం.. సక్రమంగా పన్ను చెల్లించే వారిపై అధిక భారం మోపడం, కొత్తవారిని పన్ను పరిధిలోకి తీసుకురావడం తప్పనిసరవుతోంది.
లగ్జరీ కార్లే అధికం:
ఆయా కంపెనీల నుంచి వసూలవుతున్న కార్పొరేట్ పన్నులు, దేశంలోని చట్టపరమైన వ్యాపార సంస్థల సంఖ్యను పోల్చిచూస్తే అసలు సంబంధమే లేదేమో అనిపిస్తోంది. దేశం బయటి నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆన్లైన్ వ్యాపారాలు పెద్ద సమస్యగా మారాయి. దేశీయ వస్తువులు, సేవలతో పోటీపడి విక్రయాలు జరుపుతున్నాయి. లగ్జరీ కార్లను గమనిస్తే పన్ను చెల్లింపుదారుల సంఖ్యను మించిపోయాయి. ఈ తరహా మూలాలతో ఏ దేశమూ బలమైన పునాదిని నిర్మించుకోలేదు.
బలమైన చట్టాలు అవసరం:
వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు మొత్తం కలిపి దేశంలో 2020 నాటికి 8.22 కోట్ల పన్ను చెల్లింపుదారులు ఉన్నారు. ద్విచక్ర వాహనదారులు దాదాపు 18 కోట్లు. 2022 జనవరి-జూన్ మధ్య దాదాపు 17 వేల లగ్జరీ వాహనాలు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఈ స్థాయి ఖర్చును.. వాస్తవంగా ఖజానాకు జమ అయిన ఆదాయపు పన్ను రిటర్నులతో పోలిస్తే సరిపోలడం లేదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల వ్యయాలను ట్రాక్ చేయడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తున్నందున.. బలమైన చట్టాల ద్వారా పన్ను ఎగవేతదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
టైర్ II నగరాలే కీలకం:
భారత్లో పన్ను-జీడీపీ నిష్పత్తి దాదాపు 20 శాతంగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. ఎందుకంటే జనాభాలో కొద్ది శాతం మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. టైర్ II నగరాల్లో వివిధ అసంబద్ధ మార్గాల ద్వారా పన్నుల నుంచి తప్పించుకుంటున్న వ్యక్తులు, కార్పొరేట్లపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. తద్వారా పన్ను చెల్లింపులు పెరిగి సక్రమంగా చెల్లిస్తున్న వ్యక్తులు, కార్పొరేట్లు ఆదాయంపై చెల్లించే సెస్, సర్ఛార్జీలను తొలగించడానికి వీలు కలుగుతుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి:
ఇటీవల FICCI అధ్యయనం ప్రకారం.. అక్రమ మార్కెట్లు మన జాతీయ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయి. వీటి వల్ల పొగాకు ఉత్పత్తులు, మద్య పానీయాల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంలో నష్టం 28 వేల కోట్లకు పైమాటే. బంగారం, పొగాకు, ఆల్కహాల్ వంటి అధిక లాభాల మార్జిన్ ఉన్న వస్తువులపై అధికంగా పన్నులు విధిస్తుంటారు. ఈ కారణంగా తదితర వస్తువుల అక్రమ రవాణా, భారీగా పన్ను ఎగవేత వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. స్మగ్లర్లు, తెరవెనుక సూత్రధారులను పట్టుకుని జాతీయ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంబంధిత శాఖలకు అత్యాధునిక సాంకేతికతను అందించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగాల్లో పన్ను రేట్లను తగ్గించడం వల్ల పన్ను ఎగవేత నిర్మూలన సాధ్యం కావడంతో పాటు మరింత అధికంగా పన్నులు వసూలు అయ్యే అవకాశమూ ఉంది.
వృద్ధికి ఊతమివ్వాలి:
పన్నుల సంఖ్యను తగ్గిస్తూ వాటి పరిమాణంపై దృష్టి పెట్టాలి. తద్వారా వృద్ధికి, సంపద సృష్టికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. ప్రస్తుత తరుణంలో దేశీయ స్టార్టప్లలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న, వినూత్న సాంకేతికత దిశగా ప్రపంచం అడుగులు వేస్తోంది. దేశంలో ఈ రంగం సాంకేతిక విప్లవం తీసుకురాబోతోందని అర్థమవుతోంది. ఈ తరహా వృద్ధికి ఆస్కారమున్న రంగాల విషయంలో 10 సంవత్సరాల ఉదార పన్ను విధానాన్ని అనుసరించాలి. తద్వారా 2030 నాటికి భారత్ 10 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనడంలో సందేహమే లేదు.
సమగ్ర మార్పులు అవసరం:
స్థిరమైన, తక్కువ సంక్లిష్టమైన పన్నుల విధానం.. పన్ను ఎగవేతను తగ్గించడమే కాకుండా దేశీయ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. మెరుగైన లాభాలు సాధించడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి.. కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలకు, ముఖ్యంగా సాంకేతిక రంగానికి పన్నులు మితంగా విధించాలి. ఇప్పటికే పన్ను విధించిన వాటిపై మరోసారి భారం మోపకూడదు. అనివార్య పరిస్థితుల్లో కొన్నింటిని పన్ను రహితంగానూ వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయడం వల్ల పన్నుల వసూళ్లు పెరగడంతో పాటు నిజాయితీ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుంది. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య వంటి సౌకర్యాల కల్పనకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి భారతీయ పన్నుల వ్యవస్థలో సమగ్ర మార్పులు అవసరం. ఇవి ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నుంచే మొదలైతే మరీ మంచిది.