భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం (మార్చి 2) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 50,300 పాయింట్ల సమీపంలో క్లోజ్ అయింది. సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ, భారత మార్కెట్లు మాత్రం పుంజుకున్నాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఇన్వెస్టర్లలో విశ్వాసం వచ్చింది. ఓ దశలో బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ దశలో కిందకుపడిపోయిన సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం పడిపోయినప్పటికీ, తిరిగి మంచి లాభాలు మూటగట్టుకున్నాయి.
సెన్సెక్స్ భారీగా జంప్
సెన్సెక్స్ నేడు 447.05 పాయింట్లు లేదా 0.90% లాభపడి 50,296.89 పాయింట్ల వద్ద, నిఫ్టీ 157.60 పాయింట్లు లేదా 1.07% ఎగిసి 14,919.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1813 షేర్లు లాభాల్లో, 1138 షేర్లు నష్టాల్లో ముగియగా, 166 షేర్లలో ఎలాంటి మార్పులేదు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ మంచి లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 50,258.09 పాయింట్లు లాభపడి, 50,439.82 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,807.12 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
సెన్సెక్స్ టాప్ 30లో అయిదు కంపెనీలు మినహా అన్ని స్టాక్స్ కూడా భారీగా లాభపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.32 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.95 శాతం, అదానీ పోర్ట్స్ 3.98 శాతం, విప్రో 3.86 శాతం, ఎన్టీపీసీ 3.78 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ONGC 3.03 శాతం, HDFC 1.61 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.09 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 0.97 శాతం, కోల్ ఇండియా 0.62 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఉన్నాయి.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 1.07 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.72 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 3.19 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.35 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.75 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.16 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.38 శాతం, నిఫ్టీ ఐటీ 3.04 శాతం,నిఫ్టీ మీడియా 0.81 శాతం, నిఫ్టీ మెటల్ 0.79 శాతం, నిఫ్టీ ఫార్మా 0.79 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.75 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.54 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.17 శాతం నష్టపోయాయి.