రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ రూ.9.99 శాతం వాటాను రూ.43,574 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఈ కొనుగోలు ద్వారా జియోలో అతిపెద్ద వాటాదారుగా ఫేస్బుక్ నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఈ ఒప్పందంపై వేర్వేరుగా స్పందించారు.

అంబానీ ఏం చెప్పారంటే?
జియోలో 9.99% వాటా కొనుగోలు చేసిన ఫేస్బుక్కు ముఖేష్ అంబానీ స్వాగతం పలికారు. సుదీర్ఘ భాగస్వామిగా తమ కంపెనీలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద డిజిటల్ సొసైటీగా మారుతుందన్నారు. ఇండియాను డిజిటల్ దేశంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తామని, ప్రజలకు డిజిటల్ సర్వీసులు అందిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో అందరు సురక్షఇతంగా ఉండాలని కోరారు. ఫేస్బుక్, జియో కలిసి మన దేశ డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు. మరింత వేగంగా డిజిటల్ ఇండియాగా మార్చేందుకు ఫేస్బుక్ సహకరిస్తుందన్నారు.ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ ప్రియ స్నేహితంగా మారిందన్నారు.

అందుకే జట్టుకట్టాం
జియో - ఫేస్బుక్ డీల్ పైన మార్క్ జుకర్ బర్గ్ కూడా వీడియో సందేశం ఇచ్చారు. భారత్లో డిజిటల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఇందులో భాగమయ్యేందుకు జియోతో జట్టు కట్టినట్లు తెలిపారు. ఈ బంధం భారత ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా ముందుకెళ్లేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదం చేస్తుందన్నారు. ముఖ్యంగా చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు మరింత సమర్థవంతంగా పని చేసేలా మార్గాలు రూపొందిస్తామన్నారు. ఫేస్బుక్ ఆదీనంలోని వాట్సాప్, ఇన్స్టాగ్రాంలలో ఇండియానే అతి పెద్దది అన్నారు.

జియో కీలక పాత్ర
ప్రతిభగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారత్ నిలయంగా ఉందని పేర్కొన్నారు. డిజిటల్ వ్యవస్థ దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తన్న తరుణంలో జియో కీలక పాత్ర పోషించిందన్నారు. జియో వంటి సంస్థలు లక్షలాది మంది భారతీయులు ఆన్లైన్కు అలవాటు కావడంలో తనదైన పాత్రను పోషించాయన్నారు.

వ్యాపారులకు కొత్త అవకాశాలు
చిన్నవ్యాపారులు ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకమని, అలాంటి వారికి మద్దతివ్వాలని, భారత్లో సుమారు 60 మిలియన్ల మంది చిన్నవ్యాపారులు ఉన్నారని, వారిపై లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఆధారపడుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన నేపథ్యంలో ఇలాంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు డిజిటల్ సాధనాల అవసరం ఎంతో ఉందన్నారు. కస్టమర్లకు, వ్యాపారవేత్తలకు సహకరించేందుకు తాము జియోతో జతకట్టామని జుకర్ బర్గ్ తెలిపారు. భారత వ్యాపారులకు, ప్రజలకు కొత్త అవకాశాలు కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications