సగానికిపైగా ఉద్యోగస్తులు ఇళ్ల నుంచే.. జూలైలో భారీ రిక్రూట్మెంట్: ఫేస్బుక్ సంచలన ప్రకటన
కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చాలా దిగ్గజ సంస్థలన్నీ లాక్డౌన్ కారణంగా మూసివేయబడ్డాయి. పలు సంస్థలైతే తమ ఉద్యోగస్తులను ఇంటినుంచే పనిచేయాలంటూ ఆదేశాలు జారీ చేసి తద్వారా తమ కార్యకలాపాలకు అడ్డంకి జరగకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలు దిగ్గజ టెక్ కంపెనీలు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వగా... తాజాగా సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ కూడా తమ 50శాతం మంది ఉద్యోగస్తులు ఇంటి నుంచే పనిచేస్తారని స్వయంగా ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్బర్గ్ చెప్పారు. కరోనావైరస్ లాక్డౌన్ తర్వాత కూడా ఇది కొనసాగుతుందని జుకర్బర్గ్ చెప్పారు.
సగం మంది వర్క్ ఫ్రమ్ హోమ్
ఇక జూలైలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని జుకర్బర్గ్ చెప్పారు. వీరంతా ఇంటి నుంచే పనిచేస్తారని కూడా స్పష్టం చేశారు. రానున్న 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఫేస్బుక్ సంస్థ ఉద్యోగులు 50శాతం మంది ఇళ్ల నుంచే పనిచేస్తారని వెల్లడించారు. ఇక తమ ఉద్యోగస్తులకు సంబంధించి వారు చేసే పని, వారి పనితనంపై మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటామని జుకర్బర్గ్ చెప్పారు.
వారు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారో అనే విషయాలతో పాటు మరిన్ని విషయాలను అప్డేట్ చేసేందుకు 1 జనవరి 2021 డెడ్లైన్గా విధించినట్లు జుకర్ బర్గ్ చెప్పారు. ఇదిలా ఉంటే కరోనావైరస్ తర్వాత కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలాంటి ఫలితాలు రాబడుతుందో అనేదానిపై కూడా విశ్లేషించనున్నారు.
భారీ రిక్రూట్మెంట్
ఇదిలా ఉంటే ఫేస్బుక్ కంటే ముందు మరో రెండు టెక్ దిగ్గజ సంస్థలైన ట్విటర్, మరియు స్క్వేర్లు తమ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. ఈ రెండు కంపెనీలు ట్విటర్ అధినేత జాక్ డార్సీకి చెందినవే. అయితే ఫేస్బుక్ మాత్రం ఈరెండు కంపెనీలతో పోలిస్తే మరింత పెద్దదని చెప్పొచ్చు. ఇందులో దాదాపు 50 వేల మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు.
ఇక ఈ ఏడాది 10వేల మంది ఇంజినీర్లు మరియు ప్రాడక్ట్ ఎంప్లాయిస్లను నియమించుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో అట్లాంటా, డల్లాస్, మరియు డెన్వర్లలో మరో మూడు హబ్లను ఏర్పాటు చేయనుంది. అయితే ఇవి కచ్చితంగా ఆఫీసులే అయి ఉండక్కర్లేదని జుకర్ బర్గ్ చెప్పారు. ఈ మూడు హబ్ల ఏర్పాటు వెనక ఒక కారణం ఉందని చెప్పిన ఆయన... ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తామని వెల్లడించారు. ఇప్పటి వరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా లాభనష్టాల గురించి అంచనా వేయలేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్, ఆహారం, లేబర్ కాస్ట్లలో పాక్షికంగా ఆదాకనిపిస్తుందని చెప్పారు.
ఉద్యోగస్తులు ఎంచుకునే ప్రాంతం ఆధారంగా జీతాలు
ఇక ఆఫీసుల విషయం గురించి మాట్లాడిన జుకర్బర్గ్ ఆఫీసులను అలానే ఉంచుతామని చెప్పారు. ఇక సిలికాన్ వ్యాలీలోని తమ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులకు ఏదైనా విపత్కర సమయం వస్తే వారిని ఆదుకునేందుకు భారీ పరిహారం చెల్లిస్తామని చెప్పిన జుకర్బర్గ్ అమెరికాలోని ఇతర ప్రాంతాలకు అదే తరహా పరిహారం చెల్లించాలన్న నిబంధన లేదని చెప్పారు.
అయితే ఉద్యోగస్తులు తక్కువ ఖర్చు అయ్యే ప్రదేశాల్లో నివసించేందుకు ఆమోదం తెలిపితే దాని ఆధారంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. సాధారణంగా తమ ఉద్యోగస్తులకు ఇతర సంస్థలతో పోలిస్తే మంచి వేతనం చెల్లిస్తున్నామని చెప్పారు జుకర్ బర్గ్. ఇదిలా ఉంటే 60శాతం మంది ఉద్యోగస్తులు ఇళ్ల నుంచే కాకుండా అప్పుడప్పుడు ఆఫీసులకు కూడా వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తమ అంతర్గత సర్వేలో తేలినట్లు జుకర్బర్గ్ చెప్పారు.