వచ్చే ఆర్థిక సంవత్సరం బ్యాంకుల పరిస్థితి దిగజారొచ్చు, కారణమిదే
2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగ పనితీరు కాస్తా అధ్వాన్నంగా ఉండవచ్చునని, ఎన్పీఏలు పైపైకి చేరుకుంటాయని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. కొత్త రుణాలు, ఆదాయ వృద్ధిలో స్తబ్దత, ఆస్తుల నాణ్యతలో క్షీణత నమోదయ్యే అవకాశముండటమే ఇందుకు కారణంగా తెలిపింది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ కుదుపుకు లోనవడం, చిన్న వ్యాపారాలు దెబ్బతినడం, నిరుద్యోగిత పెరగడం, ప్రైవేటు వినియోగం నెమ్మదించడం లాంటి ప్రభావం బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లపై ఇంకా పూర్తిగా కనిపించలేదని అభిప్రాయపడింది.
2021-22లో భారత బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగయ్యేందుకు సవాళ్లు ఎదురవవచ్చునని తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి పదకొండు శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. డిసెంబర్ త్రైమాసికంలో జీడీపీ అంచనాలకు మించిన వేగంతో పుంజుకోవడం సానుకూల అంశమని, అయితే పలు రంగాల పనితీరు ఇప్పటికీ వాస్తవ సామర్థ్యానికి దిగువనే ఉందని పేర్కొంది.
FY22లో బ్యాంకుల ప్రదర్శన అంత బాగుండకపోవచ్చునని, ముఖ్యంగా PSUల పరిస్థితి మరింత దిగజారవచ్చునని అభిప్రాయపడింది. దేశ ఆర్థిక వ్యవస్థను కరోనా ప్రభావం నుండి గట్టెక్కించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యల్లో ప్రభుత్వ బ్యాంకులు భాగస్వాములు కావడమే ఇందుకు కారణమని తెలిపింది. కొత్త వ్యాపారాలు లేక, ఆదాయం పెరగక, రుణాలు వసూలు కాక బ్యాంకింగ్ రంగం ఇబ్బందుల్లో పడే అవకాశముందని పేర్కొంది.