జనవరిలో 13.36 లక్షల ఉద్యోగాలు పెరిగాయి, 28% వృద్ధి
జనవరిలో EPFO పేరోల్లో కొత్తగా 13.36 లక్షల మంది నికర సబ్స్క్రైబర్లు జత కలిశారు. గత ఏడాది జనవరి నెలతో పోలిస్తే ఇది 27.79 శాతం వృద్ధి. గత ఏడాది డిసెంబర్ నెలతో పోలిస్తే 24 శాతం మంది ఎక్కువగా సబ్స్క్రైబ్ అయ్యారు. కరోనా వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 10 నెలల కాలంలో కొత్తగా 62.49 లక్షల మంది EPFOలో చేరారు.
పేరోల్ డేటాను పరిశీలిస్తే క్రమంగా కరోనా ముందుస్థాయికి చేరుకోవడాన్ని సూచిస్తోంది. 2019-20లో నికర కొత్త సబ్స్క్రైబర్ల సంఖ్య 78.58 లక్షలకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 61.12 లక్షల కోట్లుగా ఉంది. ఈపీఎఫ్ఓ ఏప్రిల్ 2018 నుండి పేరోల్ డేటాను విడుదల చేస్తోంది.
జనవరి నెలలో 22 నుండి 25 ఏళ్ల మధ్య వయస్సు గల కొత్త సబ్స్క్రైబర్లు నికరంగా 3.48 లక్షలు ఉన్నారు. వీరిని ఉద్యోగ జీవితంలోకి కొత్తగా అడుగు పెడుతోన్న వారిగా పరిగణించవచ్చు. 29 ఏళ్ల నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారి సంఖ్య నికరంగా 2.69 లక్షలుగా నమోదయింది.
EPFO ఉపాధి కల్పనలో మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి జనవరి నెలలో కొత్తగా 34.24లక్షలమంది నికర సబ్స్క్రైబర్లు చేరారు. పరిశ్రమల వారీగా చూస్తే సర్వీస్ సెక్టార్లో అత్యధికంగా ఉపాధి లభించింది. కంప్యూటర్, ఐటీ ఆధారిత సేవలు, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇంజినీరింగ్ ఉత్పత్తులకు సంబంధించి కొత్త ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో ఉంది.