8.5 శాతం చొప్పున.. డిసెంబర్ చివరి నాటికి ఈపీఎఫ్ వడ్డీ
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ బాడీ EPFO 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 8.5 శాతం వడ్డీ రేటును డిసెంబర్ చివరి నాటికి ఒకేసారి 6 కోట్ల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాల్లో జమ చేసే అవకాశముంది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో కార్మికమంత్రి సంతోష్ గాంగ్వార్ నేతృత్వంలోని ట్రస్టీ సమావేశంలో 8.5 శాతం వడ్డీ రేటును రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతం చొప్పున విభజించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది.
ఇందులో 8.15 శాతం ఈపీఎఫ్ పైన వడ్డీ కాగా, మిగిలిన 0.35 శాతం ఎక్స్చేంజీ ట్రేడెడ్ ఫండ్స్ విక్రయంపై క్యాపిటల్ గెయిన్స్. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.5 శాతం వడ్డీని చెల్లించే అంశంపై కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుండి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.
ఈ ప్రతిపాదనలకు కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. దీంతో వడ్డీ మొత్తాన్ని త్వరలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. మొదట ఈ అంశంపై ఆర్థిక శాఖ కొన్ని సందేహాలు వ్యక్తం చేయగా, ఆ సందేహాలు తీరిన తర్వాత ఆమోదం తెలిపింది.