EPF ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే మీ ఖాతాలో నిధులు పోయినట్లే..
దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ సేవలు అందించే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన చందాదారులను సైబర్ మోసాల పట్ల తీవ్రంగా హెచ్చరించింది. ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ విధానంలో మోసాలు చేసే సైబర్ నేరగాళ్లు.. పిఎఫ్ ఖాతాదారుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి సరికొత్త వ్యూహాలను పన్నుతున్నారు.
ఇందులో భాగంగానే అధికారిక సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు, సందేశాలను సృష్టిస్తూ ప్రజలను దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పిఎఫ్ ఖాతా లేదా ఆన్లైన్ సేవలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వ్యక్తిగత సమాచారంతో పాటు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది.

సైబర్ నేరగాళ్లు ప్రధానంగా ఫిషింగ్ అనే మార్గాన్ని ఎంచుకుని చందాదారులను తమ బుట్టలో వేసుకుంటున్నారు. దీనికోసం వాట్సాప్, ఈమెయిల్, క్లుప్త సందేశాలు, సోషల్ మీడియా వేదికల ద్వారా కస్టమర్ల మొబైల్ ఫోన్లకు ఆకర్షణీయమైన లేదా భయపెట్టే మెసేజ్లు పంపుతుంటారు. ఉదాహరణకు, మీ ఈపీఎఫ్ ఖాతా నిలిచిపోబోతోందని, మీ కేవైసీ వివరాలు అప్డేట్ కాలేదని లేదా మీ ఖాతాలో ఉన్న సొమ్మును పొందడానికి తక్షణమే ఐడెంటిటీ ధృవీకరణ పూర్తి చేయాలని హెచ్చరిస్తూ మెసేజ్లతో పాటు ఒక లింక్ను జతచేస్తారు.
ఖాతాదారులు కంగారుపడి ఆ లింక్పై క్లిక్ చేయగానే.. అది నేరుగా ప్రభుత్వ అసలైన ఈపీఎఫ్ఓ పోర్టల్ లాగే కనిపించే మరొక నకిలీ వెబ్సైట్కు తీసుకువెళుతుంది. అక్కడ ఖాతాదారుని యూనివర్సల్ అకౌంట్ నంబర్, ఆధార్ సంఖ్య, పాన్ వివరాలు, బ్యాంక్ ఖాతా సంఖ్యలు, లాగిన్ పాస్వర్డ్తో పాటు ఫోన్కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ నమో చేయమని అడుగుతుంది. భయంతో ఆ వివరాలన్నింటినీ అక్కడ నమోదు చేసిన వెంటనే, ఆ సమాచారం అంతా నేరుగా మోసగాళ్ల చేతికి చిక్కి మీ ఖాతాలోని నిధులు క్షణాల్లో మాయమయ్యే ప్రమాదం ఉంది.
ఈ రకమైన డిజిటల్ బెదిరింపులు, మోసాల నుండి రక్షణ పొందడానికి చందాదారులు అత్యంత అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉంది. ఈపీఎఫ్ఓ సంస్థ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సభ్యుల నుండి ఫోన్ కాల్స్ ద్వారా గానీ, మెసేజ్ల ద్వారా గానీ పాస్వర్డ్లు, ఓటీపీలు లేదా బ్యాంకింగ్ రహస్య వివరాలను సేకరించదని స్పష్టం చేసింది.
కేవలం ప్రభుత్వ చిహ్నాలు లేదా అధికారిక లోగోలు కనిపించినంత మాత్రాన ఏ వెబ్సైట్నూ లేదా సందేశాన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా మెసేజ్లో వచ్చిన లింక్ను ఓపెన్ చేయడానికి బదులుగా.. వినియోగదారులే స్వయంగా బ్రౌజర్లో అధికారిక ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అడ్రస్ను టైప్ చేసి సేవలను పొందడం అత్యంత సురక్షితమైన మార్గం.
ఏదైనా లింక్ను క్లిక్ చేసే ముందు దాని వెబ్ అడ్రస్ లేదా యూఆర్ఎల్ను క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. నకిలీ వెబ్సైట్లలో సాధారణంగా స్పెల్లింగ్ దోషాలు, అసహజమైన అక్షరాలు లేదా అపరిచితమైన డొమైన్ పేర్లు ఉంటాయి. ఈ చిన్న చిన్న తేడాలను గమనించడం ద్వారా నకిలీ సైట్లను సులభంగా గుర్తించవచ్చు.
సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ శాఖల పేర్లను వాడుకుంటూ కల్పిత భయాలను సృష్టిస్తారు కాబట్టి.. అత్యవసరమనే సందేశాలు వచ్చినప్పుడు ఒత్తిడికి లోనుకాకుండా ముందుగా నిజానిజాలు తెలుసుకోవడం శ్రేయస్కరం. ఏదైనా సందేహం వస్తే వెంటనే సంబంధిత ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాన్ని లేదా అధికారిక హెల్ప్లైన్ నంబర్లను సంప్రదించాలి. సైబర్ భద్రతా సూత్రాలను పాటిస్తూ, సున్నితమైన సమాచారాన్ని ఇతరులతో పంచుకోకపోవడమే మీ పిఎఫ్ సొమ్ముకు అసలైన శ్రీరామరక్ష.


Click it and Unblock the Notifications
