ఎయిరిండియా కొనుగోలు రేసు నుండి ఉద్యోగుల సంఘం ఔట్
ఎయిరిండియా ఉద్యోగులు కంపెనీని కొనుగోలు చేసేందుకు బిడ్డింగ్ వేసేందుకు ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల బృందం కొనుగోలు రేసులో లేనట్లుగా కనిపిస్తోంది. 200 మందికి పైగా బృందంగా ఏర్పడి అమెరికాకు చెందిన ఫండ్ ఇంటరప్స్తో కలిపి సంస్థ కొనుగోలుకు బిడ్ దాఖలు చేసింది. అయితే, నిబంధనల ప్రకారం సంస్థను కొనుగోలు చేసేందుకు కావాల్సిన అర్హతలు బిడ్లో లేవని ఎయిరిండియా నిర్ధారించినట్లు తెలుస్తోంది.
దీంతో ప్రయివేటీకరణ ప్రక్రియలో తదుపరి దశకు ఈ బిడ్ను ఎంపిక చేయడం లేదని చెబుతూ సోమవారం ఉద్యోగాల సంఘానికి లేఖ రాసినట్లుగా వార్తలు వస్తున్నాయి. టాటా సన్స్, స్పైస్ జెట్ సంస్థలు కొనుగోలు రేసులో ముందు ఉన్నట్లుగా తెలుస్తోంది. తదుపరి ప్రక్రియలో భాగంగా ఈ రెండు సంస్థలు మరింత సమగ్రమైన వివరాలతో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ దాఖలు చేయవలసి ఉంటుంది.
ఉద్యోగుల సంఘం అర్హత సాధించలేదని కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షి మాలిక్ పేర్కొన్నారు. ఆల్ ఇండియా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడాన్ని ధృవీకరించిన ఏకైక సంస్థ టాటా సన్స్ అని తెలుస్తోంది. స్పైస్ జెట్ను ధృవీకరించాల్సి ఉంది.