Moratorium: ఈఎంఐ వడ్డీ మాఫీకి ఆర్బీఐ నో, నిలదీసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్బీఐ, ప్రభుత్వం ఈఎంఐపై మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే మారటోరియం కాలానికి గాను బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. దీనిపై ఆగ్రాకు చెందిన గజేంద్ర శర్మ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మారటోరియం కాలానికి గాను ఆ తర్వాత వసూలు చేసే వడ్డీ మాఫీ చేయాలని పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
భారత్కు మూడీస్ మరో షాక్, మోడీ ప్రభుత్వం ముందు పెను సవాళ్లు
వడ్డీని వసూలు చేయాల్సిందేనని ఆర్బీఐ
మారటోరియం కాలానికి గాను రుణంపై వడ్డీని మాఫీ చేయాలన్న పిటిషనర్ వాదనతో ఆర్బీఐ విబేధించింది. బ్యాంకుల ఆర్థిక సాధికారతను పక్కన బెట్టి వడ్డీని వసూలు చేయకూడదని చెప్పడం సరికాదని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. అదే సమయంలో మారటోరియం సమయంలో ఈఎంఐలపై వడ్డీ భారంపై జూన్ 12వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆర్థికమంత్రిత్వ శాఖకు సూచించింది సుప్రీం కోర్టు.
రెండు సూచనలు చేసిన సుప్రీం కోర్టు
మారటోరియం సమయంలో రుణ వాయిదాలపై వడ్డీ రద్దుతో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం ఏర్పడుతుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఆర్బీఐ తెలిపింది. ఈ వ్యవహారంలో రెండు అంశాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. మారటోరియం వ్యవధిలో ఈఎంఐలపై వడ్డీ వసూలు చేయకపోవడం, వడ్డీపై వడ్డీ విధించకపోవడం పరిశీలించాలని తెలిపింది.
ఓవైపు ఉపశమనం అంటూ మరోవైపు వసూలు
ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చర్చనీయాంశమైన అంశమని, ఓ వైపు మారటోరియం వెసులుబాటు కల్పిస్తూ మరోవైపు పేరుకుపోయిన ఈఎంఐలపై వడ్డీని వసూలు చేస్తున్నారని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం కంటే ఆర్థిక అంశాలు ముఖ్యం కాదని తెలిపింది. ఆర్బీఐ ఇచ్చే సమాధానం ముందే మీడియాకు లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ఆర్బీఐ మొదట మీడియాకు, ఆ తర్వాత కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తుందా అని ప్రశ్నించింది.