తరుముకొస్తున్న పారిశ్రామిక రంగ సంక్షోభం.. వెండి ధరల పెరుగుదలపై ఎలాన్ మస్క్ హెచ్చరిక..
వెండి ధరలు ఈ నెలలో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లను కలవరపరుస్తోంది. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. వెండి ధరల పెరుగుదల తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదన్నారు. అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో వెండి అత్యవసరం అంటూ ఆయన X (ట్విట్టర్) వేదికగా తెలిపారు.
డిసెంబర్ నెలలో వెండి ధరలు అసాధారణంగా పెరిగాయి. బాక్సింగ్ డే నాడు బంగారం, ప్లాటినం కూడా రికార్డు స్థాయిలను తాకడంతో విలువైన లోహాలన్నింటిలో భారీ ర్యాలీ కనిపించింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా 2026లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలను మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గితే కరెన్సీ విలువ క్షీణించే అవకాశం ఉండటంతో, పెట్టుబడిదారులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణగా బంగారం, వెండి వంటి హార్డ్ ఆసెట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇదిలా ఉంటే జనవరి 1, 2026 నుంచి చైనా Silver ఎగుమతులపై కొత్త ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచ సరఫరాపై భయాలను పెంచింది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా సురక్షితమైన పెట్టుబడులపై డిమాండ్ను మరింత పెంచుతున్నాయి. ఈ అన్ని అంశాలు కలసి వెండి ధరలను గణనీయంగా పైకి నెట్టాయి.
గత శుక్రవారం తొలిసారిగా Silver ధర ఔన్సుకు 79 (£58) డాలర్లను తాకింది. డిసెంబర్ ప్రారంభంలో ఇది కేవలం 56 డాలర్ల వద్ద ఉండగా.. 2025 ప్రారంభంలో ఔన్సుకు కేవలం 29 డాలర్లు మాత్రమే ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే వెండి ధర దాదాపు మూడింతలు పెరిగినట్లైంది. ఈ వేగవంతమైన పెరుగుదలే మస్క్ వంటి పారిశ్రామిక నాయకులను ఆందోళనకు గురిచేస్తోంది.
వెండి వినియోగం విద్యుదీకరణ, సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో విస్తృతంగా ఉంది. ఇవన్నీ భవిష్యత్తులో వేగంగా పెరుగుతున్న రంగాలు కావడంతో వెండిపై డిమాండ్ మరింత పెరుగుతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వెండి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి. దీనివల్ల సరఫరా-డిమాండ్ మధ్య అసమతుల్యత మరింత తీవ్రమవుతోంది.
అయితే వెండి కేవలం పారిశ్రామిక లోహం మాత్రమే కాదు. ఇది ద్రవ్య లోహంగా, విలువ నిల్వగా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. IGలో మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకామోర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వెండిలో "తరతరాల బుడగ" (generational bubble) ఏర్పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. ఫెడ్ రేటు కోతల అంచనాలు, సెంట్రల్ బ్యాంకులు, ప్రైవేట్ పెట్టుబడిదారుల కొనుగోళ్లు విలువైన లోహాల ర్యాలీకి మద్దతు ఇస్తున్నప్పటికీ.. అసలు కారణం వెండిలో ఉన్న నిర్మాణాత్మక సరఫరా-డిమాండ్ లోటేనని ఆయన వివరించారు.
బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో సులభంగా లభించే వెండిలో పెద్ద భాగం ప్రస్తుతం న్యూయార్క్లోనే ఉంది. కీలక ఖనిజాల దిగుమతులు జాతీయ భద్రతకు ముప్పుగా మారుతున్నాయా అనే అంశంపై అమెరికా వాణిజ్య విభాగం దర్యాప్తు చేస్తోంది. ఈ సమీక్ష ఫలితంగా వెండిపై సుంకాలు లేదా ఇతర వాణిజ్య ఆంక్షలు విధించే అవకాశం ఉందని కూడా బ్లూమ్బెర్గ్ పేర్కొంది.
1979 తర్వాత ఇదే బంగారం, వెండి ధరలకు అత్యుత్తమ సంవత్సరంగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధర 70 శాతం కంటే ఎక్కువ పెరిగి ఔన్సుకు 4,500 డాలర్లను దాటింది, 2025 ప్రారంభంలో ఇది 2,623 డాలర్లు మాత్రమే. ప్లాటినం కూడా శుక్రవారం రోజున 5.3 శాతం పెరిగి ఔన్సుకు 2,338.20 డాలర్లకి చేరింది. ఆటోమోటివ్ రంగంలో కీలకమైన ప్లాటినం, పల్లాడియం ధరలు కూడా గట్టి సరఫరా, సుంకాల అనిశ్చితి, పెట్టుబడి డిమాండ్ కారణంగా భారీగా పెరిగాయి. ఈ పరిణామాలన్నీ కలసి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్ను ఒక కీలక మలుపు వద్దకు తీసుకువచ్చాయి.


Click it and Unblock the Notifications


