Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్పై సుప్రీం చారిత్రక తీర్పు.. సీఈసీ ఏమన్నారంటే..
Election Commission: దేశంలోని రాజకీయ పార్టీలు వివిధ మార్గాల్లో ఫండ్స్ సేకరిస్తుంటాయి. వాటిలో అతిముఖ్యమైనది ఎలక్టోరల్ బాండ్స్. తాజాగా వీటిని రద్దుచేస్తూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తాజాగా ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ బాండ్లపై తమ వైఖరిని స్పష్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈవీఎంలు లేకుండా ఎన్నికలు నిర్వహించడంపైన మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'నిర్ణయం రానివ్వండి, కోర్టు ఆదేశాల మేరకు మార్పులు చేస్తాం' అని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ను కొట్టివేసింది. ఇది రాజ్యాంగంలోని సమాచార హక్కు, వాక్ స్వాతంత్య్రం, భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. వీటి చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. రాజకీయ పార్టీలు అనామక డబ్బును స్వీకరించడానికి ఈ స్కీమ్ అనుమతించినట్లు అభిప్రాయపడింది. వీటి జారీని నిలిపివేయాలని బ్యాంకులను ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న తన 29 శాఖల్లో SBI ఎలక్టోరల్ బాండ్లను జారీచేసేందుకు అధికారం కలిగి ఉంది. ప్రతి ఏడాది జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లలో 10 రోజులపాటు వీటిని విక్రయిస్తుంది. అయితే ఏప్రిల్ 12, 2019 నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘంతో పంచుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని న్యాయస్థానం కోరింది.
ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రామిసరీ నోటు లాంటిది. ఇందులో చెల్లింపుదారుని పేరు సహా వివరాలు ఉంటాయి. కనీసం వెయ్యి నుంచి గరిష్ఠ పరిమితి లేకుండా ఎంతైనా చెల్లించవచ్చు. ఈ పథకం కింద, కార్పొరేట్లు మరియు విదేశీ సంస్థలు ఇచ్చే విరాళాలకు 100 శాతం పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే పార్టీల గురించి ఎటువంటి సమాచారం ఈ బాండ్లలో ఉండదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటి గురించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications


