Edible Oils: సామాన్యులకు గుడ్ న్యూస్.. దీపావళికి దిగివస్తున్న వంటనూనె ధరలు.. పూర్తి వివరాలు
Edible Oils: దేశంలో పండుగల సీజన్ స్టార్ అయింది. అందరూ బంధువులతో పసందైన విందు చేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. పైగా ఇది భోజన ప్రియులకు ఇష్టమైన సమయం. ఇలాంటి సందర్భంలో అందరూ సాధారణంగా వంటనూనె ధరల తగ్గింపు గురించి ఆలోచిస్తున్నారు.
దీపావళికి ఊరట..
దీపావళికి వంటనూనెల విషయంలో సామాన్యులకు ఊరట లభించే అవకాశం ఉంది. దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. భారత్లో ఆగస్టు నెల నాటికి పామాయిల్ దిగుమతి 87 శాతం పెరిగింది. సెప్టెంబర్ నెలలో 10 లక్షల టన్నుల వంటనూనెల దిగుమతి అయ్యే అవకాశం ఉంది. అందువల్ల, దేశంలో పెద్ద సంఖ్యలో ఎడిబుల్ ఆయిల్ అందుబాటులో ఉంటుంది. ఇది నూనెల ధరపై ప్రభావం చూపుతుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో..
ఆగస్టులో జరిపిన నూనె దిగుమతులు గత 11 నెలల్లోనే అత్యధికం. పండుగల డిమాండ్ కు అనుగుణంగా వ్యాపారులు ముందుగానే తగిన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇండస్ట్రియల్ వినియోగదారుల నుంచి మాత్రమే కాకుండా రిటైల్ వినియోగం కూడా భారీగానే పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పడిపోతున్న పామాయిల్ ధరలు..
ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధర 40 శాతం పడిపోయింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న భారత్ పెద్ద మొత్తంలో చమురును దిగుమతి చేసుకుంది. ఇది చమురు ధరపై ప్రభావం చూపుతుంది. దేశంలో ఎడిబుల్ ఆయిల్ ధర గణనీయంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి సామాన్యులకు దీపావళి సందర్భంగా చమురు ధరలకు సంబంధించి పెద్ద ఉపశమనం లభిస్తుంది.
ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో పామాయిల్ ధర మెట్రిక్ టన్నుకు 1800-1900 డాలర్ల నుంచి 1000-1100 డాలర్లకు పడిపోయింది. ప్రపంచంలోనే అత్యధికంగా నూనెల దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటి. జూలై నెలతో పోలిస్తే భారత్ రికార్డు స్థాయిలో వంట నూనెలను దిగుమతి చేసుకుంది. జూలై నెలలో 5,30,420 టన్నుల పామాయిల్ దిగుమతి చేసుకోగా.. ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 9,94,997 టన్నుల పామాయిల్ దిగుమతి అయింది. సెప్టెంబర్ నెలలో ఇవి మరింతగా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.