భారత ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో లేదు, అసమర్థ డాక్టర్లే అడ్డు: చిదంబరం
కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం భారత ఆర్థిక వ్యవస్థపై బుధవారం మరోసారి స్పందించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆమె ఆర్థిక బృందాన్ని అసమర్థ వైద్యులుగా పేర్కొన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ చర్చలో భాగంగా మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ పరిస్థితిపై కేంద్రంపై నిప్పులు చెరిగారు.
త్వరపడాల్సిందేనా?: టీవీ, ఫోన్, ఏసీ, ఫ్రిజ్.. త్వరలో పెరగనున్న ధరలు!
ఐసీయూలో కాదు.. కానీ
భారతీయ సీనియర్ ఆర్థికవేత్త అర్వింద్ సిబ్రమణియన్ మన దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై చిద్దూ స్పందిస్తూ.. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ వీల్చైర్లో కూర్చొని ఐసీయులోకి తీసుకు వెళ్తున్న పేషెంట్ మాదిరిగా ఉందన్నారు. కానీ దీనిని గేటు వద్ద అసమర్థ వైద్యుల బృందం చూసేందుకు అడ్డుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
అంతా చిందరవందర.. ఐనా బాగుందని ప్రభుత్వం
గత కొన్నాళ్లుగా డిమాండ్ పెరగడం లేదని చిదంబరం గుర్తు చేశారు. నిరుద్యోగ శాతం రోజు రోజుకు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రెడిట్ అంతా చిందరవందరగా తయారయిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం అంతా బాగానే ఉందని ఇప్పటికీ చెప్పడం విడ్డూరమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుండి 8 శాతానికి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు.
సమర్థవంత బృందం అవసరం
ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బ్యాడ్గానే ఉందని, కానీ 1991 వంటి పరిస్థితులు లేవని చిద్దూ చెప్పారు. 1997లో ఆసియా ఫైనాన్షియల్ క్రైసిస్, 2013 వంటి పరిస్థితులకు దగ్గరగా ఉందని అభిప్రాయపడ్డారు. నాటిలా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమర్థవంతమైన బృందం అవసరమని సూచించారు.
కేంద్రంపై చిద్దూ విమర్శలు
కాగా, ఇటీవల చిదంబరం మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారు. అన్ని రంగాల్లో వృద్ధి కనిపించడం లేదన్నారు. జీడీపీ రేటు దారుణంగా పడిపోయిందన్నారు. దీనికి నోట్ల రద్దు కూడా కారణమని చెప్పారు. ఐసీయూలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదన్నారు.