బంగారం గురించి సామాన్యులు మరచిపోండి.. భారీగా కొని దాచిపెట్టుకుంటున్న కేంద్ర బ్యాంకులు... ఎందుకంటే..
యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయ రిజర్వ్ ఆస్తులలో అమెరికా ప్రభుత్వ బాండ్లను (US Treasuries) వెనక్కి నెట్టి gold అత్యంత పెద్ద వాటాను దక్కించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ బ్యాంకులు నిరంతరాయంగా జరుపుతున్న కొనుగోళ్లు, బంగారం ధరల్లో నమోదైన కళ్లు చెదిరే వృద్ధి ఈ పరిణామానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈసీబీ నివేదిక ప్రకారం.. సంవత్సరాంతానికి ప్రపంచ సెంట్రల్ బ్యాంకుల మొత్తం రిజర్వ్ ఆస్తులలో బంగారం వాటా సుమారు 27 శాతానికి పెరిగింది. అంతకుముందు అంటే 2024 చివరి నాటికి ఇది కేవలం 20 శాతంగానే ఉండేది. ఇదే సమయంలో అంతర్జాతీయ డాలర్ నిల్వలకు పునాదిగా భావించే యూఎస్ ట్రెజరీల వాటా సుమారు 22 శాతానికి పడిపోయింది. 2024లో Gold ధరలు సుమారు 30 శాతం, 2025లో ఏకంగా 60 శాతం మేర భారీగా పెరగడం వల్ల మొత్తం నిల్వల విలువలో బంగారం వాటా దానంతట అదే పెరిగింది. ఒకవేళ ఈ ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పక్కన పెట్టి లెక్కిస్తే.. యూరో, బంగారం కలిపి 16 శాతం వాటాను కలిగి ఉండగా, యూఎస్ ట్రెజరీల వాటా మాత్రం 26 శాతంతో ఎక్కువగా ఉంటుంది.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక ప్రకారం.. సెంట్రల్ బ్యాంకులు నిరంతరాయంగా 863 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. గత మూడు సంవత్సరాల కాలంలో ఏడాదికి 1,000 టన్నులకు పైగా కొనుగోళ్లు జరిగినప్పటితో పోలిస్తే ఇది స్వల్పంగా తక్కువగా ఉన్నప్పటికీ డిమాండ్ బలంగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చైనా 350 టన్నులకు పైగా బంగారాన్ని సేకరించగా, ఆ తర్వాత స్థానాల్లో పోలాండ్, టర్కీ, భారతదేశం నిలిచాయి. బాహ్య సంఘర్షణలు లేదా యుద్ధ ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలు తమ ఆర్థిక రక్షణ కోసం బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయని, ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఈ ధోరణి మరింత తీవ్రమైందని ఈసీబీ పేర్కొంది.
బంగారం ప్రస్తుతం అగ్రస్థానాన్ని దక్కించుకున్నప్పటికీ, దీర్ఘకాలంలో ఈ ధోరణి ఇలాగే నిలకడగా కొనసాగకపోవచ్చని కూడా ఈసీబీ అభిప్రాయపడింది. ఎందుకంటే బంగారం ధరలలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. ఇతర బాండ్లలాగా దీనిపై ఎలాంటి వడ్డీ లేదా స్థిర ఆదాయం రాదు. వీటికి తోడు భౌతిక రూపంలో ఉండే టన్నుల కొద్దీ బంగారాన్ని భద్రపరచడం, నిల్వ చేయడం చాలా ఖరీదైన వ్యవహారమని, అలాగే అంతర్జాతీయంగా దీని సరఫరా వేగంగా పెరగదని నివేదిక వివరించింది.
ఈ పరిమితులు ఉన్నప్పటికీ, ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను ఆపేలా కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు సుమారు 850 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తోంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భౌగోళిక రాజకీయ అనిశ్చితి వంటి పెరిగిన కొనుగోళ్లకు దారితీసిన ప్రధాన కారణాలు ఇంకా ముగిసిపోనందున రాబోయే రోజుల్లోనూ బంగారానికి ఆదరణ కొనసాగనుంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
