ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్లపై కొత్త పన్ను, ఒక శాతం టీడీఎస్
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ పైన 1 శాతం మేర టీడీఎస్ను కొత్త పన్నుగా విధించాలని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. దీంతో ఈ-కామర్స్ సైట్లపై వస్తువులను విక్రయించే వారిపై భారం పడనుంది. ఇందుకు కొత్త సెక్షన్లు 194ఓను ప్రవేశ పెట్టనుంది.
ఈ-కామర్స్ లావాదేవీలపై కొత్తగా ఒక శాతం టీడీఎస్ (మూల ధనం వద్ద పన్ను మినహాయింపు)ను విధిస్తూ కేంద్రం బడ్జెట్లో ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్ఫాంను నిర్వహించే ఈ-కామర్స్ ఆపరేటర్... విక్రేతల స్థూల అమ్మకాలకు సంబంధించి 1% టీడీఎస్ మినహాయించాల్సి ఉంటుంది.
ఈ సవరణ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈ -కామర్స్ ఆపరేటర్ లేదా డిజిటల్ ప్లాట్ ఫాంను నిర్వహించే వాళ్లు లేదా ఓనర్లు మొత్తం స్థూల విక్రయాలు లేదా సేవలు లేదా రెండింటి పైన ఒక శాతం టీడీఎస్ను విధించవలసి ఉంటుంది.
అయితే, ఎవరైనా విక్రేత ఈ-కామర్స్ సైట్ ద్వారా జరిపిన స్థూల విక్రయాల మొత్తం రూ.5 లక్షలలోపు ఉండి ఆధార్ లేదా పాన్ను ఇచ్చి ఉంటే ఈ నిబంధన వర్తించదు. దీనిని అధ్యయనం చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తెలిపింది.