NO Debt Stock: మల్టీబ్యాగర్ రాబడులిచ్చిన హైదరాబాద్ ఫార్మా స్టాక్.. పైగా అస్సలు అప్పు లేని కంపెనీ..
Multibagger Stock: గత కొంత కాలంగా ఫార్మా రంగానికి చెందిన స్టాక్స్ వేగంగా పురోగమిస్తున్నాయి. ఈ తరుణంలో అనేక స్టాక్స్ మల్టీబ్యాగర్ రాబడులను అందించాయి. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ స్టాక్ గురించి. ఇది లార్జ్ క్యాప్ సెక్టార్కు చెందిన ఫార్మా స్టాక్. ప్రస్తుతం అంతర్జాతీయంగా 95 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.98,972 కోట్లుగా ఉంది.
కంపెనీ వ్యాపారం..
హైదరాబాద్లో ఉన్న ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ API తయారీదారుగా ఉంది. పైగా ఈ కంపెనీకి ఎలాంటి లోన్స్ లేకపోవటం గమనార్హం. అనేక మంది ఇన్వెస్టర్లు ఈ స్టాక్ ఎంచుకోవటానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. 19 ఏళ్ల కిందట ఈ స్టాక్ లో పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు కోటీశ్వరులు అయి ఉండేవారు.
స్టాక్ చరిత్ర..
ఈ ఫార్మా కంపెనీ స్టాక్ ధర గత శుక్రవారం రూ.3721.10 వద్ద ముగిసింది. 19 ఏళ్ల కిందటం ఈ స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వ్యక్తికి ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం దాని విలువ రూ.4.13 కోట్లుగా ఉండేది. ఈ కాలంలో స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఆగస్టు 18, 2017న షేరు ధర గరిష్ఠంగా రూ.635.20కి చేరుకుంది. ఇది గత 5 సంవత్సరాల్లో 485.82% పెరిగింది.
ఏడాదిగా స్టాక్ పరిస్థితి?
గత ఏడాది కాలంలో షేరు ధర 24.04% లాభపడింది. అయితే స్టాక్ ఈ ఏడాది ప్రారంభం నుంచి 20% క్షీణత నమోదు చేసింది. అక్టోబర్ 2021లో NSE షేర్ ధర గరిష్ఠంగా రూ.5425.10కి చేరుకుంది. అదే సంయంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.3365.55గా ఉంది. ప్రస్తుతం స్టాక్ గరిష్ఠ ధర నుంచి 31.40% క్షీణంచి మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.
కంపెనీ లాభాలు..
మొదటి త్రైమాసికంలో దివీస్ లాబొరేటరీస్ మొత్తం ఆదాయం రూ.2,434 కోట్లకు పెరిగింది. గతేడాది ఇది రూ.1,997 కోట్లుగా ఉంది. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 17.32% పెరిగింది. అదే పన్నులకు ముందు కంపెనీ లాభం రూ.851 కోట్లు ఉండగా.. అంతకు ముందు ఏడాది ఈ లాభం రూ. 814 కోట్లుగా నమోదైంది.
ఖర్చులు పెరగటంతో..
గత ఏడాది రూ.557 కోట్లతో పోలిస్తే పన్ను తర్వాత లాభం రూ.702 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది 26.03 శాతం ఎక్కువ. మార్కెట్ వర్గాల అంచనాలను స్టాక్ ప్రస్తుతానికి చేరుకోలేక పోయినప్పుటికీ.. దీర్ఘకాలం కోసం స్టాక్ కొనుగోలు చేయటం గురించి ఆలోచించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.