IPO News: ఈ వారం రెండు ఐపీవోలు.. గ్రే మార్కెట్లో అదరగొడుతున్న కంపెనీలు..
IPO News: ఐపీవో నుంచి మంచిగా డబ్బు సంపాదించుకోవాలనుకునేవారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో వరుసగా ఐపీవోలు మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిలో దాదాపు చాలా ఐపీవోలు బంపర్ లిస్టింగ్ తో ఇన్వెస్టర్లకు రోజుల్లోనే మంచి ఆదాయాన్ని అందించాయి.
తాజా ఐపీవోలు..
అయితే ఈ వారం మార్కెట్లోకి రెండు ఐపీవోలు వస్తున్నాయి. ఈ సారి ఉన్న గుడ్ న్యూస్ ఏమిటంటే ఇవి గ్రే మార్కెట్లో అదరగొడుతున్నాయి. మంచి ప్రీమియంకు ట్రేడవుతున్న తరుణంలో షేర్లు ఎలాట్ అయినవారికి మంచి రాబడులు వస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అలా ఈ వారం మార్కెట్లోకి అగ్రోకెమికల్ కంపెనీ ధర్మజ్ క్రాప్, యూనీపార్ట్స్ ఇండియా కంపెనీలు లిస్టింగ్ కోసం ఎక్స్ఛేంజీలకు వస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ధర్మజ్ క్రాప్ ఐపీవో..
నవంబర్ 28న సబ్ స్క్రిప్షన్ కోసం ధర్మజ్ క్రాప్ ఐపీవో తెరవబడుతోంది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ ను రూ.216 నుంచి రూ.237గా కంపెనీ నిర్ణయించింది. తాజాగా మార్కెట్లోకి వస్తోన్న ఐపీవో ఇప్పటికే గ్రేమార్కెట్లో రూ.60 ప్రీమియంతో ట్రేడ్ అవుతోంది. అగ్రో కెమికల్ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీ షేర్లకు మంచి గిరాకీ కనిపిస్తోంది. పెస్టిసైడ్స్ నుంచి యాంటీబయాటిక్స్ వరకు అనేక ఉత్పత్తులను ఫార్ములైజేషన్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ నిర్వహణలో కంపెనీ నిమగ్నమై ఉంది.
యూనిపార్ట్స్ ఇండియా ఐపీవో..
ఇంజనీరింగ్ సిస్టమ్స్ అండ్ సొల్యూషన్స్ అందించే వ్యాపారాన్ని నిర్వహిస్తోంది యూనిపార్ట్స్ ఇండియా కంపెనీ. కంపెనీ ఎక్కువగా వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలపై దృష్టి సారిస్తోంది. ఈ ఐపీవో నవంబర్ 30న ప్రారంభమైన డిసెంబర్ 2న ముగియనుంది. గ్రే మార్కెట్లో ఈ ఐపీవో సైతం మంచి ప్రీమియం ధరను కలిగి ఉంది. ప్రస్తుతం కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 25 దేశాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ రెండు ఐపీవోలు ఈ వారం ఇన్వెస్టర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టగలవని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.