ఇండిగో సంస్థపై కఠిన చర్యలకు సిద్ధమైన కేంద్రం..24 గంటల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశాలు..
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. వందలాది విమానాలను రద్దు చేయడం, మరికొన్ని విమానాలను ఆలస్యాలతో నడపడం వంటి సమస్యలతో తీవ్ర విమర్శలపాలవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ DGCA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఇండిగోపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రయాణికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, DGCA శనివారం ఇండిగోకు షో-కాజ్ నోటీసు జారీ చేసి, దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని కోరింది.

ఈ నేపథ్యంలో ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్, జవాబుదారీ మేనేజర్, COO ఇసిడ్రే పోర్క్వెరాస్ తమ సమాధానాన్ని సమర్పించడానికి అదనంగా సమయం ఇవ్వాలని కోరగా.. DGCA 24 గంటల పొడిగింపు మంజూరు చేసింది. ఇప్పుడు Indigo సమాధానం ఇవ్వడానికి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. ఇకపై మరిన్ని పొడిగింపులు ఉండే అవకాశాలు చాలా తక్కువని వర్గాలు చెబుతున్నాయి.
రద్దుల అసలైన కారణంగా కొత్త విమాన విధి, విశ్రాంతి కాల నిబంధనల అమలు సమయంలో సరైన సిబ్బంది ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమని విమానయాన రంగ నిపుణులు భావిస్తున్నారు. ఈ నిబంధనల అమల్లో తాత్కాలిక సడలింపులను పొందిన ఒక రోజు తర్వాతే ఇండిగో అత్యధికంగా 400కి పైగా విమానాలను రద్దు చేసింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు విమాన కౌంటర్ల వద్ద పెద్ద క్యూల్లో నిలబడాల్సి వచ్చింది. సామాను పోయిన వారు, రీబుకింగ్ కోసం ప్రయత్నించిన వారు గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చి ప్రయాణికులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు స్పష్టమైంది.
ఈ పరిస్థితిపై స్పందించిన సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్, ప్రయాణికులు చెప్పలేని బాధను అనుభవించాల్సి వచ్చిందని, జవాబు చెప్పాల్సిన బాధ్యత నుండి ఇండిగో తప్పించుకోలేదని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ DGCA ఇప్పటికే నలుగరు సభ్యుల విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని.. ఇండిగోపై తగిన చర్యలు తప్పవని తెలిపారు. అంతేకాక ఎయిర్లైన్లు టికెట్ల అమ్మకాలపై ప్రభుత్వం తాత్కాలిక పరిమితులు విధించింది.
ఇక ప్రయాణికుల కోసం ప్రత్యేక సపోర్ట్ సెల్లు ఏర్పాటు చేసి, రీఫండ్ ప్రక్రియలను వేగవంతం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఇండిగో రూ. 610 కోట్ల రీఫండ్ను ప్రాసెస్ చేసినట్లు సమాచారం. రద్దైన విమానాల రీషెడ్యూలింగ్కు అదనపు ఫీజులు వసూలు చేయడం లేదని కూడా ప్రకటించింది. ఆదివారం పూణే విమానాశ్రయంలో 14 రాకపోకలు, 18 బయలుదేరే విమానాలు ప్రభావితమవడం వల్ల అక్కడ పెద్ద స్థాయిలో గందరగోళం నెలకొంది.
పరిస్థితి కొంత మెరుగుపడుతోందని ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ తెలిపారు. దశలవారీగా మేము తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాము. ఈరోజు 1,650 విమానాలను నడపగలమని, ఆన్టైమ్ పెర్ఫార్మెన్స్ 75 శాతం వరకు చేరుతుందని ఆశిస్తున్నామని ఆయన ఒక అంతర్గత వీడియో సందేశంలో చెప్పారు. ప్రస్తుతం DGCA నివేదిక అనంతరం ఇండిగోపై ఏమి చర్యలు తీసుకుంటుందో అన్న ఆసక్తి పెరిగింది. ప్రయాణికులు ఇకపై ఇలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రభుత్వం, DGCA మరింత కఠినమైన నియంత్రణ చర్యలను అమలు చేసే అవకాశాలున్నాయి.


Click it and Unblock the Notifications