ఒక్క నిర్ణయం స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చింది..సర్కారును పునరాలోచనలో పడేసింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తిరిగి మార్కెట్లోకి వచ్చాయి. స్టాక్ మార్కెట్లు జుమ్మని పెరిగాయి. ఆ నిర్ణయమే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్ పీఐ) పై విధించిన సర్ చార్జీ. బడ్జెట్లో వేసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి కన్నా నష్టమే ఎక్కువ ఉందని గ్రహించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నిర్ణయం వెనక్కి తీసుకున్నప్పటి నుంచి మార్కెట్లు జోరుగా పెరుగుతున్నాయి. దీనికి కార్పొరేట్ టాక్స్ తగ్గింపు తోడయింది. ప్రభుత్వం రానున్న కాలంలో మరిన్ని సంస్కరణలు చేపట్టే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపాయి. ఇదే తరుణంలో మ్యూచువల్ ఫండ్స్ లోను పెట్టుబడులు పెరిగాయి.
రూ. 24,000 కోట్లు
* ఒక్క సానుకూల నిర్ణయం చాలు ఇన్వెస్టర్లలో భరోసా నింపడానికి. ప్రభుత్వం తీసుకున్న పాజిటివ్ నిర్ణయాలకు ప్రతీకగా ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతుంటాయి. ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్లు 24,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు. ఇంతకు ముందు త్రైమాసికంతో పోల్చితే పెట్టుబడులు ఏకంగా 35 శాతం పెరిగాయి. ఇందుకు కారణం ఎఫ్ పీ ఐ లపై విధించిన సర్ చార్జీ తగ్గింపు, కార్పొరేట్ పన్నులో కోత వంటి నిర్ణయాలేనని మార్నింగ్ స్టార్ నివేదిక వెల్లడించింది.

* ఈ పెట్టుబడుల కారణంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు జూన్ చివరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు 7.23 లక్షల కోట్ల నుంచి 7.24 లక్షల కోట్ల రూపాయల వరకు పెరిగాయి.
* ఇదే కాలంలో ఈక్విటీ కేటగిరీలో పెట్టుబడులు 17,680 కోట్ల నుంచి 23,874 కోట్లకు పెరిగాయి.
* లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
* అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కొంత కరెక్షన్, ఎఫ్ పీ ఐ ల అమ్మకాల వల్ల మార్కెట్లలో కొంత అనిచ్చితి నెలకొంది. స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీల్లో లిక్విడిటీ కీ సంబంధించిన ఆందోళనలు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి పెట్టుబడులను ప్రభావితం చేశాయి.
సిప్ ల మద్దతు..
* క్రమానుగత పెట్టుబడి పథకాల (సిప్) ద్వారా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను పెంచుకుంటున్నారు. దీనివల్ల మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు పెరిగే అవకాశం ఏర్పడుతోంది.
* చిన్న చిన్న మొత్తం తో వారం, నెల, మూడునెలలకు ఒకసారి పెట్టుబడి పెట్టడానికి సిప్ ల ద్వారా అవకాశం ఏర్పడుతుంది.
మూడు త్రైమాసికాలనుంచి...
* గత మూడు త్రైమాసికాల నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
* సెప్టెంబర్ త్రైమాసికంలో నికర పెట్టుబడులు రూ.46,578 కోట్లు గా ఉన్నాయి. జూన్ త్రైమాసికం (రూ. 42,357 కోట్లు )తో పోల్చితే నికర పెట్టుబడులు 10 శాతం మేర పెరిగాయి.


Click it and Unblock the Notifications