రూ. 2 కోట్ల అప్పు.. రాత్రికి రాత్రే ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ.. హాట్ డిబేట్గా టెకీ సక్సెస్ స్టోరీ..
జీవితం ఎప్పుడు, ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అంతా సజావుగా సాగిపోతోంది అనుకున్న క్షణంలోనే విధి మనల్ని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ కవత్రా జీవితంలో సరిగ్గా ఇదే జరిగింది.
ఒకప్పుడు నెలకు రూ. 5 లక్షల భారీ జీతంతో, లగ్జరీ కార్పొరేట్ జీవితాన్ని అనుభవించిన ఈ Delhi Techie, రాత్రికి రాత్రే వీధిన పడ్డారు. ఇటీవల ఆయన తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ లింక్డ్ఇన్లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతోమందిని కదిలిస్తోంది. వేలాది మంది ఉద్యోగులు, నిపుణులు ఈ కథలో తమను తాము చూసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు.
ఈ కథ 2018 నాటిది. గౌరవ్కు అప్పుడు 37 ఏళ్లు. ఒక చైనీస్ మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్గా అత్యున్నత పదవిలో ఉన్నారు. సమాజంలో గౌరవం, చేతినిండా డబ్బు, కళ్లముందు ప్రకాశవంతమైన భవిష్యత్తు. అదే నమ్మకంతో ఢిల్లీలో దాదాపు రూ. 2 కోట్ల భారీ గృహ రుణం (Home Loan) తీసుకుని ఒక అందమైన ఇల్లు కొనుక్కున్నారు. కానీ, ఒకరోజు అకస్మాత్తుగా కంపెనీ నుండి వచ్చిన ఆ ఒక్క లేఖ ఆయన ప్రపంచాన్ని ముక్కలు చేసింది.

పనితీరు బాలేదనే నెపంతో ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, ఎలాంటి సెవరెన్స్ ప్యాకేజీ (పరిహారం) కూడా ఇవ్వకుండా కేవలం మూడు రోజుల నోటీసు ఇచ్చి కంపెనీ ఆయన్ను ఉద్యోగం నుండి తొలగించింది. ఆ క్షణాన్ని గుర్తుచేసుకుంటూ గౌరవ్.. నేను నగ్నంగా బయటకు నడిచాను. నాపై ఒక ఉద్యోగ తొలగింపు ముద్ర పడింది అంటూ ఆనాటి నిస్సహాయతను పంచుకున్నారు.
ఆ తర్వాత ప్రారంభమైన రోజులు నరకప్రాయంగా మారాయి. సమాజం చూసే చూపు, ప్రతి నెలా బ్యాంకు నుండి వచ్చే ఈఎంఐల ఒత్తిడి ఆయనను ఊపిరాడకుండా చేశాయి. కొత్త ఉద్యోగం కోసం ఊపిరి సలపకుండా ప్రయత్నించారు. 108 సార్లు కంపెనీలకు ఫోన్ చేశాను.. 108 సార్లూ తిరస్కరణే (Rejections) ఎదురైందని ఆయన రాశారు.
ఆ నిరంతర అవమానం, ఆర్థిక అనిశ్చితి ఆయన మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. తెల్లవారుజామున 3 గంటలకు గుండె ఆగిపోయినంత పని చేస్తూ పానిక్ అటాక్స్ (Panic Attacks) వచ్చేవి. రాత్రుళ్లు నిద్ర కరువైంది. మానసిక క్షోభను తట్టుకోలేక రాత్రికి 12 నుండి 15 సిగరెట్లు తాగే అలవాటుకు బానిసయ్యారు.
ఆ రోజుల్లో తనను అత్యంత బాధించిన విషయాన్ని చెబుతూ.. పొరుగువారు నేను ఇంట్లో ఖాళీగా కూర్చోవడాన్ని అనుమానంగా చూసేవారు. నా చిన్న కూతురు అమాయకంగా ఒక ప్రశ్న అడిగితే, తండ్రిగా దానికి సమాధానం చెప్పలేక లోపల కుంగిపోయాను. నన్ను బతికుండగానే పాతిపెట్టేశారేమో అనిపించింది అంటూ గౌరవ్ పడిన వేదన ఎవరికైనా కన్నీళ్లు తెప్పిస్తుంది. అయితే, ఈ క్లిష్ట సమయంలో ఆయన ఆత్మహత్య సదృశ్యమైన ఆలోచనలు చేయకుండా, ధైర్యాన్ని కూడగట్టుకున్నారు.
పురుషులు తమ బాధను లోపలే దాచుకోకూడదని ఆయన హితవు పలికారు. మీ భార్యతో మాట్లాడండి. మీ అమ్మను పట్టుకుని ఎంత వీలైతే అంత ఏడవండి. అవమాన భారాన్ని లోపల దాచుకుని ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకండి. డబ్బును మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాన్ని, శరీరాన్ని కాదు అని ఆయన ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
కాలక్రమేణా గౌరవ్ తిరస్కరణలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేశారు. కేవలం ఒక కంపెనీ లోగోపై, డిగ్రీలపై ఆధారపడటం ఎంత ప్రమాదకరమో తెలుసుకున్నారు. డిగ్రీలకు కాలం చెల్లుతుంది, కానీ ఆచరణాత్మక నైపుణ్యాలు నిరంతరం వృద్ధి చెందుతాయి అని గ్రహించి సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో తనను తాను పునర్నిర్మించుకున్నారు. ఓటమిని ఒప్పుకోకుండా కన్సల్టింగ్ రంగంలోకి అడుగుపెట్టారు.
నేడు గౌరవ్ కవత్రా ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త. కార్పొరేట్ రంగాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆయన ఏకంగా రూ. 6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాదారుడిగా వ్యవహరించారు. భారతదేశంలోని 19 రాష్ట్రాల్లో కార్పొరేట్ సంస్థలతో కలిసి పనిచేశారు. ఆనాడు కంపెనీ ఇచ్చిన లేఖ తనను ముంచేయలేదని, అది తనకు బలవంతంగా లభించిన "పునర్జన్మ" అని ఆయన గర్వంగా చెబుతున్నారు.
నాడు ఉద్యోగం పోయి రోడ్డున పడ్డ ఆ 37 ఏళ్ల వ్యక్తి, నేడు వేలాది మందికి స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. జీవితంలో ఎంతటి ఓటమి ఎదురైనా, అది అంతం కాదు... ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం మాత్రమే అని గౌరవ్ కథ నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications
