ఒకరి తప్పు.. అందరికీ శిక్ష! రూ. 2 కోట్ల నష్టం వస్తే ఉద్యోగుల జీతాలు కట్ చేసిన స్టార్టప్ కంపెనీ!
కార్పొరేట్ కంపెనీలలో లేదా స్టార్టప్లలో ఉద్యోగులు తప్పులు చేయడం, వాటి వల్ల కంపెనీలు నష్టపోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. సాధారణంగా అలాంటప్పుడు సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటారు. కానీ, ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ మాత్రం ఎవరూ ఊహించని వింత నిర్ణయం తీసుకుంది. ఒక ఉద్యోగి చేసిన పొరపాటు వల్ల కంపెనీకి రూ. 2 కోట్ల నష్టం వస్తే.. ఆ భారాన్ని ఉద్యోగులందరిపై వేసింది. ఈ షాకింగ్ ఉదంతం ఒక ఉద్యోగి ద్వారా రెడిట్ (Reddit) వేదికగా బయటకు రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ (Trending) అవుతోంది.

అసలేం జరిగింది?
సదరు స్టార్టప్లో పనిచేసే ఒక ఉద్యోగి టెస్టింగ్ సమయంలో చేసిన పెద్ద పొరపాటు వల్ల, ఒక అంతర్జాతీయ క్లయింట్కు సంబంధించిన ముఖ్యమైన ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. దీనివల్ల కంపెనీకి ఏకంగా రూ. 2 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. దీంతో కంపెనీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. అయితే, తప్పు చేసిన వ్యక్తిని మాత్రమే శిక్షించకుండా.. ఆ నష్టాన్ని పూడ్చడానికి టీమ్లోని ఉద్యోగులందరి జీతాల నుండి 20 నుండి 30 శాతం కోత విధిస్తున్నట్లు మేనేజ్మెంట్ ప్రకటించింది.
సంతకం పెట్టాలంటూ ఒత్తిడి!
ఈ నష్టాన్ని కవర్ చేయడానికి వచ్చే రెండు నెలల పాటు 20-30% తక్కువ జీతం తీసుకోవడానికి అంగీకరిస్తూ ఉద్యోగులందరూ లిఖితపూర్వకంగా (ఇన్ రిటన్) సమ్మతి తెలపాలని కంపెనీ కోరింది. అంతేకాదు, ఈ ఏడాది జరగాల్సిన యాన్యువల్ అప్రైజల్స్ (జీతాల పెంపు) ను కూడా హోల్డ్లో పెట్టేసింది.
ఈ విషయాన్ని షేర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్.. తాను గత రెండేళ్లుగా ఆ కంపెనీలోనే పనిచేస్తున్నానని, కోర్ టెక్నికల్ ఆర్కిటెక్చర్ను తానే స్క్రాచ్ నుండి డెవలప్ చేశానని పేర్కొన్నాడు. ప్రస్తుతం 20 మంది డెవలపర్స్ ఉన్న టీమ్ను లీడ్ చేస్తున్న అతనికి, జీతం తగ్గినా బతకడానికి సరిపడా సేవింగ్స్ ఉన్నాయి. కానీ, "ఒకరు చేసిన తప్పుకు కంపెనీ మొత్తం జీతాలు తగ్గించడం ఎంతవరకు న్యాయం? ఇది చట్టబద్ధమేనా?" అంటూ అతను ప్రశ్నించాడు.
ఈసోప్స్ (ESOPs) నమ్మొచ్చా? కంపెనీ మారాలా?
జీతాల కోతకు అంగీకరిస్తే.. దానికి బదులుగా కంపెనీలో ఎక్కువ ఈసోప్స్ (ESOPs - కంపెనీ షేర్లు) ఇవ్వమని అడగవచ్చా? అని కూడా అతను ఆలోచిస్తున్నాడు. అలాగే, ఒక రూ. 2 కోట్ల నష్టానికే కంపెనీ ఇలా చేస్తోందంటే.. భవిష్యత్తులో మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? వెంటనే ఉద్యోగం మారిపోవడం మంచిదేనా? అని నెటిజన్ల సలహా కోరాడు.
నెటిజన్ల ఆగ్రహం.. "వెంటనే ఆ జాబ్ మానేయ్!"
ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు సదరు స్టార్టప్ కంపెనీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. "కంపెనీకి లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులకు 30% అదనంగా ప్రాఫిట్ షేరింగ్ ఇస్తున్నారా? లేనప్పుడు నష్టాలను మాత్రం ఎలా షేర్ చేసుకుంటారు?" అని ఒకరు ప్రశ్నించారు.
మరొక యూజర్ స్పందిస్తూ.. "ఇలాంటి నష్టాలను ఫౌండర్లు , అప్పర్ మేనేజ్మెంట్ భరించాలి కానీ సాధారణ ఉద్యోగులు కాదు. ఇక ఈసోప్స్ (ESOPs) ఇస్తామనే మాటలను అస్సలు నమ్మొద్దు. అవి భవిష్యత్తులో కంపెనీకి వచ్చే ఫండింగ్పై ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ ఆఫర్ను తిరస్కరించి, వెంటనే వేరే ఉద్యోగం చూసుకోవడం బెటర్" అని సలహా ఇచ్చారు. ఏదేమైనా, ఈ ట్రెండింగ్ (Trending) పోస్ట్ ప్రస్తుత స్టార్టప్ లలోని వర్క్ కల్చర్ , ఉద్యోగుల హక్కులపై పెద్ద చర్చకు తెరలేపింది.


Click it and Unblock the Notifications