Pension: ఢిల్లీ హైకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ.. సాయుధ బలగాలకు అనుకూలంగా తీర్పు
Pension: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్) సిబ్బంది మొత్తానికి పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎనిమిది వారాల్లోగా ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జస్టిస్ సురేష్ కుమార్ కైట్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఈ మేరకు జనవరి 1, 2004 ప్రకటనల ఆధారంగా నియమించిన బలగాల విషయమై.. 2003లో ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ సహా 2020లోని పెన్షనర్ల సంక్షేమ శాఖ మెమరాండంను రద్దు చేసింది. సీఆర్పీఎఫ్, సశాస్త్ర సీమ బల్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ విభాగాల సిబ్బంది దాఖలు చేసిన 82 పిటిషన్లకు సంబంధించి 58 పేజీల తీర్పును వెలువరించింది.
సీఏపీఎఫ్ సిబ్బంది వాదన
అసిస్టెంట్ కమాండెంట్స్ గ్రూప్ 'A' పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ.. స్పెషల్ సెలక్షన్ బోర్డ్ జూన్ 2002లో జారీ చేసిన ప్రకటనను పిటిషనర్ల తరపున న్యాయవాది అంకుర్ చిబ్బర్ కోర్టుకు సమర్పించారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30, 2002 కాగా తుది ఫలితాలు జూలై, 2004లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
అక్టోబర్ 2004 నుంచి 2005 వరకు నియామక పత్రాలు జారీ చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు. అయితే జనవరి 1, 2004 నుంచి కొత్తగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) అమలు చేయాలంటూ.. డిసెంబర్ 22, 2003లో నోటిఫికేషన్ వెలువడినట్లు చెప్పారు. అప్పటికే పాత పెన్షన్ పథకంలో సాయుధ బలగాలు కొనసాగుతున్నందున ఈ విధానం వర్తించదని వాదనలు వినిపించారు.
కేంద్రం తరపు స్పందన
డిసెంబర్ 2003లో ఎన్పీఎస్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. పిటిషనర్లు 2004-05 మధ్య ఉద్యోగంలో చేరారని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హరీష్ వైద్యనాథన్ శంకర్ కోర్టుకు తెలిపారు. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన అనంతరమే వారు అపాయింట్ అయినందున పాత పద్ధతికి అర్హులు కాదని వాదించారు.
కోర్టు నిర్ణయం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 మరియు 2003 డిసెంబర్లో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్లను పరిశీలించిన న్యాయస్థానం.. సాయుధ బలగాల సిబ్బంది ఓపీఎస్కు అర్హులని పేర్కొంది. ఈ సందర్భంగా.. దేశ రక్షణలో వారి పాత్రను ప్రశంసించింది. ప్రభుత్వాలు తీసుకునే విధాన పరమైన నిర్ణయాలు వారి ప్రయోజనాలకు ఆటంకం కాకుండా చూడాలని సూచించింది.