రిలయన్స్ ఒప్పందానికి బ్రేక్, హైకోర్టు ఆదేశాలపై ఫ్యూచర్ గ్రూప్ సవాల్
రిలయన్స్తో తమ డీల్పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు మీద ఫ్యూచర్ గ్రూప్ శనివారం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. సింగపూర్ ఎమర్జెన్సీ ఆర్బిట్రేషన్ ఆదేశాలను సమర్థిస్తూ రిలయన్స్తో ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లరాదని ఫ్యూచర్ రిటైల్కు ఢిల్లీ హైకోర్టు సింగిల్ బెంచ్ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కూపన్స్ అదే కోర్టులో ఉన్నత ధర్మాసనాన్ని ఆశ్రయించాయి. మార్చి 22న విచారణకు వస్తుంది. సింగిల్ బెంచ్ తీర్పు ప్రభావం ప్రస్తుతం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ముందు ఉన్న సర్దుబాటు పథకంపై ఉండదని ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది.
రిలయన్స్, ఫ్యూచర్ రిటైల్ సంస్థల మధ్య కుదిరిన రూ.24,713 కోట్ల ఒప్పందానికి ఇటీవలే బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందాన్ని నిలిపివేయాలని సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది. అమెజాన్ పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్యూచర్ గ్రూప్ ఉద్దేశపూర్వకంగా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉత్తర్వుల్ని ఉల్లంఘించిందని అభిప్రాయపడిన కోర్టు రిలయన్స్తో కుదిరిన ఒప్పందానికి సంబంధించి ముందుకు వెళ్లరాదని ఫ్యూచర్ రిటైల్ను ఆదేశించింది.
కిషోర్ బియానీ తదితరులు ఏప్రిల్ 28వ తేదీన ఢిల్లీ హైకోర్టుకు హాజరు కావాలని, వారి ఆస్తులను జప్తు చేయాలని సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు. అంతేకాకుండా ఆర్బిట్రేషన్ ఆదేశాన్ని ఉల్లంఘించినందుకు మూడు నెలల పాటు జైలులో ఎందుకు నిర్బంధించకూడదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే దీనిపై ఫ్యూచర్ గ్రూప్ అప్పీల్కు వెళ్లింది.